మృత్యుకౌగిలి... టూ వీలర్ పై నలుగురు యువకులు... కాటేసిన ఇన్నోవా!

  • చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం
  • రాంగ్ రూట్ లో వచ్చి ఢీకొట్టిన ఇన్నోవా
  • పెట్రోలు ట్యాంకు పేలి ప్రమాదం
చిత్తూరు జిల్లాలో గత రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. బైకుపై సామర్థ్యానికి మించి ప్రయాణించడం, కుడివైపు నుంచి ఓ ఇన్నోవా వేగంగా రావడం ప్రమాదానికి కారణం కాగా, నలుగురు యువకులు మృత్యుఒడికి చేరారు. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, బైరెడ్డిపల్లెకు చెందిన నలుగురు స్నేహితులు ద్విచక్రవాహనంపై పలమనేరుకు వచ్చి, తిరిగి ఇంటికి బయలుదేరారు.

ఈ క్రమంలో వీరు కమ్మనపల్లె సమీపంలోకి రాగానే, ఓ ఇన్నోవా వాహనం రాంగ్ రూట్ లో వచ్చి బైకును ఢీకొంది. అదుపుతప్పిన బైకు కిందపడగా, పెట్రోలు ట్యాంకు పేలింది. హఠాత్తుగా రేగిన మంటల్లో ఇద్దరు పాక్షికంగా కాలిపోయి, మరో ఇద్దరి తలలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మరణించారు. వీరిని తేజ (23), కిషోర్ (21), వంశీధర్ (22), వినోద్ (22)లుగా గుర్తించిన పోలీసులు, వారి బంధువులకు సమాచారం అందించారు. ఇన్నోవాలో ప్రయాణిస్తున్న ముగ్గురికి స్వల్ప గాయాలు అయ్యాయి. చేతికి అందివచ్చిన బిడ్డలు దూరమైన భారంలో యువకుల తల్లిదండ్రులు విలపిస్తుంటే, వారిని ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు.
Go Back to Shorts
Chittoor District
Palamaneru
Road Accident
Innova

More Telugu News