‘పోలవరం’పై శ్వేతపత్రం విడుదల చేయాలి: సోము వీర్రాజు డిమాండ్

  • పేదల రక్తాన్ని చంద్రబాబు, ఆయన అనుచరులు పీల్చేస్తున్నారు
  • చంద్రబాబు దోపిడీకి ఆస్కార్ అవార్డు కూడా చాలదు
  • సీఎం రమేష్ ఊళ్లో ఉన్న షుగర్ ఫ్యాక్టరీ, డెయిరీని తెరిపించాలి
పోలవరం ప్రాజెక్టుపై ఏపీ సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ నేత సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పేదల రక్తాన్ని సీఎం చంద్రబాబు, ఆయన అనుచరులు ఏనుగు తొండాలతో పీల్చినట్టుగా పీల్చుతున్నారని, చంద్రబాబు దోపిడీకి ఆస్కార్ అవార్డు కూడా చాలదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టు అంచనాలు పెంచి అవినీతికి పాల్పడుతున్న మంత్రి దేవినేని ఉమకు తమను విమర్శించే అర్హత లేదని అన్నారు.

 వైఎస్ఆర్ హయాంలోనే పోలవరం ముంపు ప్రాంతం 1.10 లక్షల ఎకరాలకుగాను యాభై వేల ఎకరాలకు నష్టపరిహారం ఇచ్చేశారని, మిగిలిన ఎకరాలకు రూ.5 నుంచి రూ.6 వేల కోట్లు చాలని, కానీ, ఆర్ అండ్ ఆర్ రూ.33 వేల కోట్లు అంటున్నారని విమర్శించారు. ఏ ప్రాజెక్ట్ అయినా చంద్రబాబుకు ఉపాధిహామీ పథకమేనని, ‘నీరు-చెట్టు’ పథకంలో రూ.13,600 కోట్ల అవినీతికి పాల్పడ్డారని, అందులో మట్టి అమ్ముకుని ఎన్ని వేల కోట్లు దోచేశారో అని ఆరోపించారు. ముందుగా, సీఎం రమేష్ ఊళ్లో ఉన్న షుగర్ ఫ్యాక్టరీ, డెయిరీని తెరిపించి, ఆ తర్వాత ఉక్కు ఫ్యాక్టరీ కావాలని అడిగితే బాగుంటుందని ఎద్దేవా చేశారు.
Go Back to Shorts
Chandrababu
somu veeraju

More Telugu News