Visakhapatnam District: సెల్‌ఫోన్‌లో బ్లూ ఫిల్ములు చూసి.. 13 ఏళ్ల బాలికపై 15 ఏళ్ల బాలుడి అత్యాచార యత్నం

  • విశాఖ జిల్లాలో ఘటన
  • పోలీసుల అదుపులో బాలుడు
  • కోర్టు ఆదేశాలతో జువైనల్ హోంకు తరలింపు

సెల్‌ఫోన్‌లో నిత్యం నీలి చిత్రాలు చూస్తూ వాటి ప్రభావానికి గురైన 15 ఏళ్ల బాలుడు 13 ఏళ్ల బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన విశాఖపట్టణం జిల్లా కోటవురట్ల మండలం బాపిరాజు కొత్తపల్లిలో జరిగింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు జువైనల్ హోంకు తరలించారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..

నిందితుడైన బాలుడు వరుసకు సోదరైన బాలికతోపాటు ముగ్గురితో కలిసి ఈనెల 10న గ్రామ శివారులో ఉన్న పాక వద్దకు వెళ్లారు. అందులో కూర్చుని కాసేపు అందరూ కలిసి సెల్‌ ఫోన్లో కొన్ని వీడియోలు చూశారు. తర్వాత వర్షం వచ్చే సూచనలు ఉండడంతో అక్కడి నుంచి ముగ్గురు ఇళ్లకు వెళ్లి వెళ్లిపోయారు. దీంతో బాధిత బాలిక, నిందితుడు మాత్రమే పాకలో మిగిలారు.

వర్షం పడుతుండడంతో పాకలో ఉన్న సిమెంట్ బస్తాలపై కవర్ కప్పేందుకు బాలిక వెళ్లగా వెనక నుంచి వచ్చిన బాలుడు ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. దీంతో భయపడిన బాలిక పెద్దగా అరవడంతో ఆమె చున్నీతో గొంతు బిగించి అదిమి పట్టాడు. దీంతో ఊపిరాడని ఆమె స్పృహ కోల్పోయి కిందపడింది.

ఆమెను అక్కడే వదిలేసి ఇంటికి వెళ్లిన బాలుడు.. బాలికపై సిమెంట్ బస్తా పడిందని, పాకలోనే ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యులు వెళ్లి ఆసుపత్రిలో చేర్పించారు. అయితే, మూడు రోజుల తర్వాత బాలుడిపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు విషయం బయటపడింది.

బాలికను లైంగికంగా వేధించడమే కాకుండా హత్య చేసేందుకు కూడా ప్రయత్నించాడని నర్సీపట్నం రూరల్‌ సీఐ ఎల్‌.రేవతమ్మ తెలిపారు. సెల్‌ఫోన్‌లో బాలుడు నీలి చిత్రాలను, నేర సంఘటనలను చూస్తూ ఆ ప్రభావానికి గురయ్యాడని తెలిపారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కోటవురట్ల పోలీసులు ఈ నెల 14న బాలుడిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. విచారణలో బాలికను లైంగికంగా వేధించినట్టు తేలిందని పేర్కొన్నారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు నిందితుడిని విశాఖ జువైనల్ హోంకు తరలించినట్టు సీఐ రేవతమ్మ తెలిపారు.

More Telugu News