Andhra Pradesh: మొబైల్ కంపెనీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: మంత్రి యనమల

షార్ట్స్‌లో చూడండి
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా మొబైల్ కంపెనీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్ ఎపెక్స్ కమిటీ సభ్యులకు ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు హామీ ఇచ్చారు. సచివాలయంలో యనమలను ఇండియన్ సెల్యూలార్ అసోసియేషన్ ఎపెక్స్ కమిటీ సభ్యులు ఈరోజు కలిశారు. మొబైల్ తయారీ కంపెనీలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయనకు వివరించారు. జీఎస్టీతో పాటు పలు రకాల పన్నులను మొబైల్ అమ్మకాలపై మినహాయించాలని కోరారు. రూ.1200 నుంచి రూ.50 వేల విలువ చేసే సెల్ ఫోన్ వరకూ ఒకే రకమైన జీఎస్టీ విధిస్తున్నారని వారు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

దీనిపై యనమల రామకృష్ణుడు స్పందిస్తూ, సెల్ కంపెనీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వారికి హామీ ఇచ్చారు. రాష్ట్ర స్థాయిలో పన్నుల మినహాయింపులపై సీఎం చంద్రబాబునాయుడుతో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని, సీజీస్టీపై ఉన్న అభ్యంతరాలను జీఎస్టీ కౌన్సిల్ దృష్టికి తీసుకెళతామని చెప్పారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని, ముఖ్యంగా రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనలో కీలక భూమిక పోషిస్తున్న మొబైల్ తయారీ కంపెనీల ఏర్పాటుకు విస్తృతమైన రాయితీలు కల్పిస్తున్నట్టు చెప్పారు.  
Go Back to Shorts
Andhra Pradesh
Yanamala

More Telugu News