Smart Tv: భారీగా పెరిగిన పోటీ... సగం ధరకే స్మార్ట్ టీవీలు!

  • స్మార్ట్ టీవీ మార్కెట్లోకి గ్లోబల్ సంస్థల ప్రవేశం
  • ఒకప్పుడు రూ. 30 వేలకు పైగా ఉన్న 32 అంగుళాల టీవీ ఇప్పుడు రూ. 13,500కే
  • మార్కెట్ వాటాను పెంచుకుంటున్న చైనా, తైవాన్ కంపెనీలు

భారత స్మార్ట్ టీవీ మార్కెట్లోకి గ్లోబల్ సంస్థల ప్రవేశంతో ఎల్సీడీ, ఎల్ఈడీ టీవీల ధరలు సగానికి పడిపోయాయి. అధిక ఫీచర్లతో, తక్కువ ధరల్లోనే షియోమీ, థామ్సన్, టీసీఎల్ తదితర సంస్థలు తమ ఉత్పత్తులను అందరికీ అందుబాటు ధరల్లో అందిస్తున్నాయి. రెండేళ్ల క్రితం 32 అంగుళాల టీవీ ధర రూ. 30 వేల పైమాటే కాగా, ఇప్పుడు రూ. 13,500కే లభిస్తోంది. ఇక 40 అంగుళాల టీవీ ధర రూ. 50 వేల నుంచి రూ. 20 వేలకు దిగొచ్చింది. ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్లు అయిన శాంసంగ్, ఎల్జీ, సోనీ తదితర కంపెనీలు సైతం 32 అంగుళాల టీవీ ధరను రూ. 30 వేల రేంజ్ నుంచి రూ. 23 వేల రేంజ్ కి తగ్గించాయి. ఈ ధరకన్నా దాదాపు సగం తక్కువకు కూడా మార్కెట్లో స్మార్ట్ టీవీలు అందుబాటులో ఉండటం గమనార్హం.

ఇక ధరలో ఇంత వ్యత్యాసం ఉండటంతో చైనా, తైవాన్ కంపెనీలు అమ్మకాల్లో దూసుకెళుతూ మార్కెట్ వాటాను పెంచుకుంటున్నాయి. ఇదే సమయంలో నెలసరి వాయిదాల పద్ధతిలో డబ్బు చెల్లించేలా స్మార్ట్ టీవీలకు ఫైనాన్స్ సదుపాయం కూడా కంపెనీలు అందిస్తుండటంతో వీటి అమ్మకాలు శరవేగంగా పెరుగుతున్నాయి. ఇక స్మార్ట్ టీవీ కంపెనీలు కంటెంట్ పై ప్రధానంగా దృష్టిని సారిస్తూ, హాట్ స్టార్, వూట్ం సోనీ లైఫ్, హంగామా తదితర ఆన్ టీవీ డిమాండ్ సేవలనూ ఈ సంస్థలు అందిస్తున్నాయి.

ఇదిలావుండగా, భారత టీవీ మార్కెట్ రూ. 50 వేల కోట్లుగా ఉందన్న అంచనాలుండగా, స్మార్ట్ టీవీ విభాగం వాటా 40 శాతం వరకూ అంటే రూ. 20 వేల కోట్ల వరకూ ఉంది. గత రెండు సంవత్సరాల్లో సాలీనా 40 శాతం వృద్ధితో అమ్మకాలు పెరుగుతూ ఉండటం గమనార్హం. ధరలు తగ్గుతూ ఉండటం, ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ పై విక్రయాలకు కొత్త కంపెనీలు ఆసక్తి చూపుతూ ఉండటంతో వచ్చే రెండేళ్లలో ఈ-కామర్స్ మాధ్యమంగా జరిగే విక్రయాలు 20 శాతం వాటాను దక్కించుకుంటాయని అంచనా.

More Telugu News