Chandrababu: శశికళ పరిస్థితి తనకూ వస్తుందేమోనని జగన్‌కు భయం: చంద్రబాబు

  • ఇవ్వాల్సిన కేంద్రాన్ని వదిలేసి మనపై విమర్శలు
  • ప్రశ్నిస్తే శశికళలా జైలు పాలు కావాల్సి వస్తుందని భయం
  • కర్ణాటకలో బీజేపీకి ప్రచారం చేసి కేసుల నుంచి ఉపశమనం పొందుతున్నారు

ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని ప్రశ్నిస్తే తన జీవితం శశికళలా ఎక్కడ తయారవుతుందోననే భయంతోనే జగన్ ఆ పని చేయడం లేదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన కేంద్రాన్ని కాదని, తనపైనా, టీడీపీపైనా విమర్శలు చేస్తున్న జగన్ వైఖరి సరికాదన్నారు. ‘మహానాడు’లో చంద్రబాబు మాట్లాడుతూ జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నిస్తే తమిళనాడులో శశికళలాగా తననెక్కడ జైలుకు పంపుతారో అనే భయం జగన్‌ను వెంటాడుతోందని చంద్రబాబు అన్నారు. ఇటీవల కర్ణాటకలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని వైసీపీ ప్రచారం చేసిందని, ఆ వెంటనే ఈడీ, సీబీఐ కేసులు నెమ్మదించాయని ఆరోపించారు. పలు కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులు ప్రధాని ఇంటికి, కార్యాలయానికి వెళ్తుంటే దర్యాప్తు సంస్థలు మాత్రం ఏం చేయగలవని విచారం వ్యక్తం చేశారు. ప్రతి శుక్రవారం కోర్టుకెళ్లి బోనులో చేతులు కట్టుకుని నిల్చునే వ్యక్తి బయటకొచ్చి మనపై విమర్శలు చేస్తున్నారని చంద్రబాబు అన్నారు.

More Telugu News