ఎగ్జిట్ పోల్స్ వినోదం కోసమే... వాటిని చూసి ఆందోళన చెందకండి: సిద్ధరామయ్య

  • సగటు గణాంకాలపై ఆధారపడే పోల్స్ అవి
  • విజయంపై ధీమా
  • ఈ మేరకు ట్విట్టర్లో పోస్టింగ్
కర్ణాటక రాష్ట్రంలో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాదని, హంగ్ ఏర్పడుతుందంటూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ప్రకటించినప్పటికీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఏ మాత్రం కలవరం చెందడం లేదు. వాటిని పూచిక పుల్లతో సమానంగా తీసిపడేశారు. ఆ రాష్ట్రంలో 225 అసెంబ్లీ స్థానాలు ఉండగా, అధికారం ఏర్పాటుకు కావాల్సిన 113 మార్కును ఏ పార్టీ చేరుకోలేదని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన విషయం విదితమే. వీటిపై సిద్ధరామయ్య ఈ ఉదయం ట్విట్టర్లో స్పందించారు. రెండు రోజుల పాటు వినోదం పంచేవిగా ఎగ్జిట్ పోల్స్ ను అభివర్ణించారు. వీటిని చూసి ఆందోళన చెందక్కర్లేదని పార్టీ శ్రేణులకు సూచించారు.

‘‘ఎగ్జిట్ పోల్స్ రెండు రోజుల పాటు వినోదం పంచేవి. ఒక నది సగటున 4 అడుగుల లోతు ఉందంటూ ఓ గణాంకకుడు చెప్పిన వివరాల ఆధారంగా ఓ వ్యక్తి ఆ నదిలో నడుచుకుంటూ వెళ్లడం అసాధ్యం. ఎగ్జిట్ పోల్స్ సైతం ఈ తరహా గణాంకాలపైనే ఆధారపడతాయి. కనుక ప్రియమైన పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు, శ్రేయోభిలాషులు ఎగ్జిట్ పోల్స్ గురించి ఆందోళన చెందకండి’’ అంటూ సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. విజయంపై ధీమాను వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Karnataka elections
exit polls
siddharamaiah

More Telugu News