'సహానా నీ దగ్గరికే వచ్చేస్తున్నాం' అంటూ తల్లిదండ్రుల ఆత్మహత్య!

అనారోగ్యంతో కుమార్తె మృతి చెందడాన్ని తట్టుకోలేకపోయిన తల్లిదండ్రులు బలవన్మరణానికి పాల్పడిన ఘటన నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లిలో కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, గరిపె సందీప్, పూజ భార్యాభర్తలు. వారి కుమార్తె సహానా (5) రెండు నెలల క్రితం అనారోగ్యంతో మరణించింది. అప్పటినుంచి తీవ్రమైన ఒత్తిడిలోకి వెళ్లిపోయిన ఇద్దరూ, పాపను ఖననం చేసిన ప్రాంతానికి వెళ్లి అక్కడే పడుకోవడం, ఏడుస్తూ కూర్చోవడం చేస్తుండేవారు. గ్రామస్తులు, సన్నిహితులు వెళ్లి వారిని ఓదార్చి ఇంటికి తెస్తుండేవాళ్లు.

ఈ క్రమంలో కుమార్తెను తలచుకుని ఇక బాధపడలేమని, ఆమె లేని ప్రపంచం తమకు వద్దని, తాము కూడా ఆమె వద్దకే వెళుతున్నామని సందీప్ డైరీలో రాశాడు. ఆకలై అన్నం తింటున్నామే తప్ప, బతకాలని లేదని చెప్పాడు. ఆపై సందీప్, పూజ ఇద్దరూ ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వీరికి మణిదీప్ అనే చిన్న బాబు కూడా ఉన్నాడు. తల్లిదండ్రుల మరణంతో ఆ బాబు అనాధగా మిగిలాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించామని, కేసును దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
Go Back to Shorts
Nizamabad District
Sucide
Daughter Died

More Telugu News