అగ్రిగోల్డ్ బాధితుల ఉసురంతా ప్రతిపక్షానికే తగులుతుంది: ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు
- బాధితులకు న్యాయం చేసేందుకు చిత్తశుద్దితో పనిచేస్తున్నాం
- వాస్తవాలు తెలుసుకోకుండా బొత్స మాట్లాడుతున్నారు
- బురదజల్లే విధంగా బొత్స మాట్లాడటం కరెక్టు కాదు
అగ్రిగోల్డ్ బాధితుల ఉసురంతా ప్రతిపక్షానికే తగులుతుందని, అగ్రిగోల్డ్ అంశంపై తనకు అవగాహన ఉంది కనుక, బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూస్తానని అన్నారు. ఈ అంశాన్ని రాజకీయం చేయాలని తాము చూడటం లేదని, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కోర్టును కూడా తప్పు పట్టే విధంగా బొత్స మాట్లాడుతున్నారని, ఈవిధంగా మాట్లాడొచ్చా? లేదా? అనేది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు.
‘కమిటీలో ప్రభుత్వం నియమించిన ప్రతినిధిని నేను. అగ్రిగోల్డ్ వ్యవహారమంతా చూస్తున్నాను. కనుక, ఈ వ్యవహారంపై మాట్లాడేందుకు నా వద్ద సమగ్ర సమాచారం ఉంది. ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నాను.. ప్రకటిస్తున్నాను. బురదజల్లే విధంగా బొత్స మాట్లాడటం కరెక్టు కాదు. ప్రతి విషయాన్ని రాజకీయం చేసి పబ్బం గడుపుకునే బొత్సకు క్రెడిబులిటీ ఉందా? అని ఓ అధికారిగా కాకుండా ఓ పౌరుడిగా ప్రశ్నిస్తున్నా’ అని కుటుంబరావు మండిపడ్డారు.