ఈ కేసులో తీర్పిస్తే, నా తీర్పు మార్చేస్తారు: సుప్రీం జస్టిస్ చలమేశ్వర్ సంచలన వ్యాఖ్యలు
- మరోసారి ఆవేదన వ్యక్తం చేసిన చలమేశ్వర్
- కేసుల కేటాయింపు విధానాన్ని సమీక్షించాలని మాజీ మంత్రి శాంతిభూషణ్ పిటిషన్
- తాను విచారిస్తే, తీర్పును తోసిపుచ్చుతారన్న చలమేశ్వర్
సుప్రీంకోర్టుకు సంబంధించినంత వరకూ చీఫ్ జస్టిసే సుప్రీం అంటూ నిన్న ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తేల్చి చెప్పిన నేపథ్యంలో, కేసుల కేటాయింపునకు మార్గదర్శకాలు ఉండాలంటూ కేంద్ర న్యాయ శాఖ మాజీ మంత్రి శాంతి భూషన్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును అత్యవసరంగా విచారించేందుకు చలమేశ్వర్ నిరాకరించారు.
మాస్టర్ ఆఫ్ రోస్టర్ విధానాన్ని సవాల్ చేస్తున్న పిల్ కాబట్టి చీఫ్ జస్టిస్ వద్దకు వెళ్లలేదని పిటిషనర్ చెప్పగా, ఈ అంశంలో తాను జోక్యం చేసుకోలేనని చలమేశ్వర్ స్పష్టం చేశారు. అందుకు కారణాలు కూడా అందరికీ తెలుసునని అన్నారు. కాగా, ఈ పిటిషన్ ఇప్పుడు సుప్రీం న్యాయమూర్తుల్లో ఆరో స్థానంలో ఉన్న జస్టిస్ ఏకే సిక్రీ ధర్మాసనం ముందుకు రానుంది.