ఓయూకి వెళ్లిన శ్రీరెడ్డి.. మద్దతు ప్రకటించిన విద్యార్థి సంఘాలు

  • శ్రీరెడ్డికి ఓయూ జేఏసీ మద్దతు
  • 'మా' వ్యవస్థ కొన్ని కుటుంబాలకే పరిమితమైందని విమర్శలు
  • వారికే అవకాశాలు ఇస్తోందని ఆరోపణలు
టాలీవుడ్‌లో తనలాంటి తెలుగు అమ్మాయిలకు అన్యాయం జరుగుతోందని, తనను నమ్మించి మోసం చేశారని తీవ్ర ఆరోపణలు చేస్తూ సంచలనంగా మారుతోన్న నటి శ్రీరెడ్డి ఈ రోజు హైదరాబాద్‌ తార్నాకలోని ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లింది. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు ఆమెతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆమెకు మద్దతు ప్రకటించారు.

శ్రీరెడ్డి నిరసన వెనుక ఉన్న ఆమె ఆవేదనను అర్థం చేసుకోవాలని ఓయూ జేఏసీ నాయకులు అన్నారు. 'మా' (మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌) వ్యవస్థ కొన్ని కుటుంబాలు, కులాలకే పరిమితమవుతోందని, వారికే అవకాశాలు ఇస్తోందని ఆరోపించారు. ఈ తీరు ఇలాగే కొనసాగితే ఓయూ జేఏసీ అంతా కలిసి 'మా' ఆఫీసుని ముట్టడిస్తుందని హెచ్చరించారు. 'మా' చర్య దుర్మార్గంగా ఉందని, శ్రీరెడ్డికి అన్యాయం చేసిందని అన్నారు.

ఈ సందర్భంగా శ్రీరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఓ ఆడపిల్ల ఏడిస్తే ఎవ్వరూ చేతులు కట్టుకుని ఉండరని ఓయూ విద్యార్థులు నిరూపిస్తున్నారని వ్యాఖ్యానించింది. తనను ఓ చెల్లిలా భావించి ఓయూ విద్యార్థులు తన కష్టాల గురించి తెలుసుకున్నారని తెలిపింది. ఇండస్ట్రీలో తనలాంటి అన్యాయం చాలా మందికి జరిగిందని చెప్పింది.
Go Back to Shorts
sri reddy
Hyderabad

More Telugu News