Andhra Pradesh: హోదా కోసం ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం : ఏపీ మహిళా కాంగ్రెస్ నేత సయ్యద్ హజీనా
- ఏపీ మహిళా కాంగ్రెస్ సమీక్షా సమావేశం
- టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలపై పోరాడేందుకు సన్నద్ధం కావాలి
- ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అన్ని హామీలు చేయాలి
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం ఏపీ మహిళా కాంగ్రెస్ ఉద్యమాన్ని తీవ్రతరం చేయనుందని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఇన్ చార్జ్ సయ్యద్ హజీనా పేర్కొన్నారు. ఏపీసీసీ రాష్ట్ర కార్యాలయం ఆంధ్రరత్నభవన్లో ఏపీ మహిళా కాంగ్రెస్ సమీక్షా సమావేశం ఈరోజు నిర్వహించారు. తొలుత మాజీ ప్రధాని ఇందిర గాంది విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఏపీ మహిళా కాంగ్రెస్ ఇన్ చార్జి సయ్యద్ హజీనా మాట్లాడుతూ, టీడీపీ, బీజేపీ ప్రభుత్వాల ఎన్నికల హామీలు, వైఫల్యాలపై పోరాడేందుకు సన్నద్ధం కావాలని పిలుపు నిచ్చారు.
ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అన్ని హామీలను అమలు చేయాలని పోరాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, ప్రధాని మోదీ ప్రజా వ్యతిరేక నిర్ణయాల వలన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. నాలుగేళ్ళుగా మోదీకి తొత్తులా చంద్రబాబు వ్యవహరించారని, ప్రజలంతా రోడ్డెక్కి నిరసన తెలుపుతున్న కారణంగా చంద్రబాబు యూ టర్న్తీసుకొని ప్రత్యేక హోదా అంటూ ఉద్యమించడం సిగ్గుచేటని అన్నారు. బీజేపీతో టీడీపీ తెగతెంపులు చేసుకున్నప్పటికీ ఇంకా వీరిద్దరి మధ్య లోపాయికారి ఒప్పందాలు జరుగుతూనే ఉన్నాయి అన్నారు. ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా మహిళలైన తాము రోడ్డెక్కుతుంటే ఇతర పార్టీలు పోరాడటానికి ఏమైందని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించేంత వరకు తమ పోరాటం ఆగదని అన్నారు.