చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ఇక తిరుగేలేదు...!

  • చైనా శాశ్వత అధ్యక్షుడిగా జిన్‌పింగ్‌కు మార్గం సుగమం
  • రెండు పర్యాయాల పరిమితి చట్టం తొలగింపు
  • చైనా పార్లమెంట్ నిర్ణయానికి ట్రంప్ సానుకూలత
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు ఇక తిరుగే లేదు. ఎందుకంటే, చైనా పార్లమెంట్ 'నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్' ఆయనకు జీవితకాలం పాటు దేశాధ్యక్షుడిగా కొనసాగే అవకాశాన్ని కల్పించే చట్టాన్ని ఈ రోజు ఆమోదించింది. దీనికి సంబంధించి నిర్వహించిన ఓటింగ్‌లో మొత్తం 2964 మంది పాల్గొన్నారు. ముగ్గురు గైర్హాజరయ్యారు. రెండు ఓట్లు ఆయనకు వ్యతిరేకంగా వచ్చాయి. మిగిలిన ఓట్లన్నీ జిన్‌పింగ్‌కి అనుకూలంగానే వచ్చాయి. 1990ల్లో అమల్లోకి తెచ్చిన దేశాధ్యక్షుడిగా ఎవరైనా రెండు పర్యాయాలు మాత్రమే పోటీ చేయాలన్న నిబంధనకు ఈ రోజుతో తెరపడింది. జిన్ పింగ్ 2023లో పదవీ విరమణ చేయాల్సి ఉన్న నేపథ్యంలో అధ్యక్ష పదవికి రెండు సార్లే పోటీ చేయాలన్న నిబంధనను తొలగించాలని పార్టీ నేతలు గతనెల నిర్ణయించిన సంగతి విదితమే.

జిన్‌పింగ్‌కు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) సిద్ధాంతాలను సైతం మార్చే హోదాను కట్టబెట్టారు. ఫలితంగా పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్‌తో ఆయన సమానమైన హోదాను పొందినట్లయింది. అంటే, గతంలో చైనాను జీవితకాలం పాలించింది మావోనే. ఆయన తర్వాత అలాంటి హోదాను పొందింది జిన్‌పింగ్ మాత్రమే. షీ జిన్‌పింగ్ ఇప్పుడు సర్వశక్తిసంపన్నుడుగా అవతరించారు. మరోవైపు ఈ నిర్ణయాన్ని కొందరు తప్పుబట్టుతున్నారు. చైనాలో అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల నిర్వహణకు ఉన్న పరిమితిని ఎత్తివేస్తే రాజరికం ఏర్పడుతుందని, అందువల్ల దీనికి వ్యతిరేకంగా తాము పోరాడుతామని ప్రముఖ జర్నలిస్ట్ లి డటోంగ్ అంటున్నారు. ఇదిలా ఉంటే, చైనా కాంగ్రెస్ నిర్ణయానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుకూలంగా మాట్లాడటం పలు విమర్శలకు ఆస్కారం కల్పిస్తోంది.
Go Back to Shorts
Xi jinping
China
Communist party of china

More Telugu News