Telangana: డబ్బు ఇవ్వకపోతే.. ఫొటోలు బయటపెడతామంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్న ముగ్గురు యువతులపై కేసు!

  • మాదాపూర్ కి చెందిన ద్వారకానాథ్ రెడ్డితో ఎల్లారెడ్డిగూడ యువతులకు పరిచయం
  • వారి వద్ద ద్వారకానాథ్ రెడ్డికి చెందిన అభ్యంతరకర ఫొటోలు, వీడియోలు
  • 2 కోట్లు కావాలంటూ యువతుల డిమాండ్

మీకు సంబంధించిన అభ్యంతరకర ఫొటోలు, వీడియోలు బయట పెడతామంటూ యువతులను బ్లాక్ మెయిల్ చేసే యువకులను చూశాం. కానీ ఒక వ్యక్తి అభ్యంతరకర ఫొటోలు, వీడియోలు బయటపెడతామంటూ ఒక పురుషుడిని ముగ్గురు యువతులు బ్లాక్ మెయిల్ చేసి డబ్బు గుంజిన ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. బంజారాహిల్స్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మాదాపూర్‌ కు చెందిన ద్వారకానాథ్‌ రెడ్డికి ఎల్లారెడ్డిగూడకు చెందిన ముగ్గురు యువతులతో పరిచయముంది.

దీంతో వారి వద్ద అతనికి సంబంధించిన వివిధ అసభ్యకర ఫొటోలు, వీడియోలు ఉన్నాయి. వాటిని బయటపెడతామంటూ వారు ద్వారకానాథ్ రెడ్డిని బ్లాక్ మెయిల్ చేస్తూ, ఇప్పటికే పెద్ద మొత్తంలో డబ్బులు గుంజారు. అయినా సంతృప్తి చెందని ఆ యువతులు 2 కోట్లు ఇవ్వాలని, లేని పక్షంలో తమ వద్ద ఉన్న ఫొటోలు, వీడియోలు బయటపెడతామని ఆయనను తాజాగా హెచ్చరించారు. 

దీంతో ద్వారకానాథ్ రెడ్డి భార్య మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. యువతులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న నేపథ్యంలో ఈ కేసును, మాదాపూర్ నుంచి బంజారాహిల్స్ కు బదిలీ చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

More Telugu News