New Delhi: కేజ్రీవాల్ కళ్లెదుటే ఆప్ ఎమ్మెల్యేలు నన్ను కొట్టారు: ఢిల్లీ సీఎస్ సంచలన ఆరోపణ

  • ఎల్జీ అనిల్ బైజల్ కు అన్షు ప్రకాష్ ఫిర్యాదు
  • ఎమ్మెల్యేలు దాడి చేస్తుంటే కేజ్రీవాల్ చూస్తుండిపోయారు
  • కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన అన్షు
తనను ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసంలోనే ఇద్దరు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు దారుణంగా కొట్టారని ఢిల్లీ చీఫ్ సెక్రటరీ అన్షు ప్రకాష్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఘటన కేజ్రీవాల్ చూస్తుండగానే జరిగిందని లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ఇంటికి వచ్చి మరీ ఆయన ఫిర్యాదు చేశారు. పౌరులకు పలు రకాల సేవలను నేరుగా అందించే విషయమై ప్రభుత్వ ప్రణాళికల గురించి తెలుసుకునేందుకు తాను సోమవారం రాత్రి కేజ్రీవాల్ ఇంటికి వెళ్లానని, అక్కడున్న ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ తనపై తిట్లకు దిగి కొట్టారని ఆయన ఆరోపించారు.

ఈ ఘటన జరిగిన వెంటనే అనిల్ బైజల్ ఇంటికి వెళ్లిన ఆయన, తన ఎమ్మెల్యేలను కనీసం నిలువరించే ప్రయత్నాన్ని కేజ్రీవాల్ చేయలేదని ఆరోపించారు. తనపై దాడి చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, గత కొంతకాలంగా సీఎస్, ఆప్ ప్రజాప్రతినిధుల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాము ప్రజలకు నిస్వార్థ సేవలు అందించాలని కృషి చేస్తుంటే, కేంద్రంలో అధికారాన్ని అనుభవిస్తున్న బీజేపీకి ఏజంటుగా మారిన అనిల్ బైజల్ ప్రతి పథకాన్నీ అడ్డుకుంటున్నారని, ఆయనకు సీఎస్ మద్దతుగా నిలుస్తున్నారని కేజ్రీవాల్ ఇటీవల ఆరోపించారు.

More Telugu News

New Delhi
Arvind Kejriwal
Anshu Prakash
Anil Baizal