Yashodhara Raje Scindia: హస్తానికి ఓటేస్తే మీకు రిక్తహస్తాలే : బీజేపీ నేత యశోధర రాజే వివాదాస్పద వ్యాఖ్యలు

  • ఎన్నికల ప్రచారంలో బీజేపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
  • ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించిన కాంగ్రెస్
  • వచ్చే వారంలో కొలారస్ సీటుకు ఉప ఎన్నికలు

బీజేపీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి యశోధర రాజే సింధియా ఆ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హస్తానికి ఓటేస్తే ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు దక్కవంటూ ఓటర్లను ఓ రకంగా హెచ్చరించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. కాంగ్రెస్ నేత రామ్ సింగ్ యాదవ్ మరణంతో రాష్ట్రంలోని శివపురి జిల్లాలో ఉన్న కొలారస్ నియోజకవర్గానికి వచ్చేవారంలో ఉప ఎన్నికలు జరగనున్నాయి.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఓటర్లు కమలం గుర్తును కాదని హస్తం గుర్తుకు ఓటేస్తే, కొత్తగా ప్రవేశపెట్టిన 'ప్రధానమంత్రి ఉజ్వల యోజన' పథకం ఫలాలు దక్కవని ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆమె ఓటర్లను భయపెట్టారంటూ విపక్ష కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో పాటు మంత్రి యశోధరా రాజేపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఆమె వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించడమే అవుతుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్ యాదవ్ అన్నారు.

More Telugu News