rgv: విచారణలో రామ్ గోపాల్ వర్మ చెప్పింది ఇదే!: డీసీపీ

  • సినిమాను తాను తీయలేదని చెప్పారు
  • కాన్సెప్ట్ మాత్రమే తనదని తెలిపారు
  • వాస్తవాలను బయటకు లాగుతాం

'జీఎస్టీ' సినిమాను తాను తీయలేదని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చెప్పారని సైబర్ క్రైమ్ డీసీపీ రఘువీర్ తెలిపారు. ఈ రోజు వర్మను విచారించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ సినిమాతో తనకు ఎలాంటి సంబంధం లేదని... కేవలం కాన్సెప్ట్ మాత్రమే తనదని వర్మ చెప్పారని తెలిపారు. కాన్సెప్ట్ ను మాత్రమే తాను అమ్మానని వెల్లడించారని చెప్పారు. ఈ నేపథ్యంలో, ఈ కేసుకు సంబంధించి చాలా టెక్నికల్ ఎవిడెన్సెస్ ను సేకరించాల్సి ఉందని... అన్ని వైపుల నుంచి ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తామని తెలిపారు. 'సత్యమేవ జయతే'ను 'సత్య మియా జయతే' అంటూ వర్మ ట్వీట్ చేసిన అంశాన్ని కూడా ఈ కేసులోనే చేరుస్తామని చెప్పారు.

నగ్నంగా ఉన్న మాల్కోవాతో వర్మ ఉన్న ఫొటోలను ఆయన ఫోన్, ల్యాప్ టాప్ నుంచి డౌన్ లోడ్ చేసి, ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపుతామని... ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత... ఈ ఫొటోలన్నీ ఎలా వచ్చాయి? మీరు ఏం తీశారు? ఎందుకు తీశారు? అనే విషయాలను తదుపరి విచారణలో ప్రశ్నిస్తామని డీసీపీ తెలిపారు. సినిమాను ఎక్కడ తీసినా, చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు.

భారతీయ పౌరుడు విదేశాల్లో తప్పు చేసినా, ఇక్కడ శిక్షించవచ్చని తెలిపారు. సినిమా షూటింగ్ లో ఆయన ఇన్వాల్వ్ అయ్యారా? లేదా? అనే విషయాన్ని తేల్చాల్సి ఉందని చెప్పారు. స్కైప్ ద్వారా తాను డైరెక్ట్ చేశానని... ఆ సినిమా అశ్లీల చిత్రం కాదని, ఒక ఆర్ట్ ఫిల్మ్ అని వర్మ చెబుతున్నారని... అయితే, ఆయన చెప్పే విషయాలను తాము పట్టించుకోబోమని డీసీపీ తెలిపారు.

More Telugu News