yv subba reddy: కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ఒరగబెట్టిందేమీ లేదు: వైవీ సుబ్బారెడ్డి
ఈరోజు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ఒరగబెట్టిందేమీ లేదని, నిరాశకు గురయ్యామని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర బడ్జెట్ లో ఏపీకి మరోమారు అన్యాయం జరిగిందని అన్నారు. విభజన చట్టంలోని హామీలు అమలవుతాయని ఆశించి భంగపడ్డామని, పోలవరం ప్రాజెక్టు, రైల్వే జోన్, దుగరాజపట్నం అంశాలను ప్రస్తావించలేదని విమర్శించిన ఆయన, రైతులకు మద్దతు ధరను 1.5 రెట్లు పెంచుతామని హామీ ఇవ్వడం కొంత మేరకు ఊరటనిచ్చిందని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని పక్షంలో తాము చెప్పిన ప్రకారం తమ పదవులకు రాజీనామా చేసేందుకు కట్టుబడి ఉన్నామని అన్నారు.