గవర్నర్, బాలకృష్ణలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన అంబటి

ఇరు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ పై ఇప్పటికే టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డ సంగతి తెలిసిందే. తాజాగా వైసీపీ కూడా ఈ జాబితాలో చేరింది. తెలుగుదేశం పార్టీ ప్రచార కమిటీ అధ్యక్షుడిగా నరసింహన్ వ్యవహరిస్తున్నారంటూ అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ పదవిలో ఉన్న నరసింహన్ టీడీపీ అనుకూల భజన చేస్తున్నారని విమర్శించారు.

పార్టీ ఫిరాయింపుల విషయంపై గవర్నర్ స్పందించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు మంత్రులుగా కొనసాగడం దారుణమని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలను అంబటి సమర్థించారు. ఇప్పటికైనా ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదే సమయంలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై అంబటి విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి కుర్చీని బాలకృష్ణ అవమానించడం సరికాదని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్న సంప్రదాయాలను గౌరవించాలని చెప్పారు. బాలయ్య తీరు చూస్తే టీడీపీ పాలన ఎలా ఉందో తెలుస్తుందని అన్నారు. సీఎం సీట్లో కూర్చున్నప్పుడు పక్కనున్న మంత్రులు కానీ, అధికారులు కానీ ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు. ఒకవేళ చెబితే కొడతారనే భయంతో చెప్పలేదా? అని ఎద్దేవా చేశారు. బావమరిదిని ముఖ్యమంత్రిని చేయాలని చంద్రబాబు అనుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు.
Go Back to Shorts
ambati rambabu
balakrishna
narasimhan

More Telugu News