కొత్త కరెన్సీ బాగాలేదు... మార్చే ఆలోచన చేయాలని ఆర్బీఐకి ఢిల్లీ హైకోర్టు కీలక సూచన!

నూతనంగా విడుదల చేసిన రూ. 50, రూ. 200 నోట్లను మార్చే అంశాన్ని పరిశీలించాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రానికి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కీలక సూచనలు చేసింది. ఈ నోట్లు వర్ణాంధత్వం ఉన్నవారు గుర్తించేందుకు అనువుగా లేవని అభిప్రాయపడ్డ హైకోర్టు, ఏ మాత్రం అవకాశమున్నా వీటి రంగు మరింత కనిపించేలా మార్పు చేయాలని కోరింది. నోట్ల సైటు, గుర్తింపు చిహ్నాలను కూడా మార్చాలని తాత్కాలిక చీఫ్ జస్టిస్ గీతా మిట్టల్, జస్టిస్ హరి శంకర్ లతో కూడిన ధర్మాసనం సూచించింది.

ముందుగానే ఈ విషయాలను గమనించడంలో ఆర్బీఐ నిర్లక్ష్యం కూడా ఉందని అభిప్రాయపడ్డ కోర్టు, ప్రజల ప్రయోజనార్థం తమ సూచనల అమలుకు ప్రయత్నించాలని కోరింది. కరెన్సీ ఎంత సైజులో ఉండాలన్న విషయాన్ని గతంలో కేంద్రం నిర్ణయించేదన్న విషయాన్ని గుర్తు చేసిన కోర్టు, ఇప్పుడలా ఎందుకు చేయడం లేదని ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు సిలిసిటర్ జనరల్ సంజయ్ జైన్ ను ప్రశ్నించింది. తదుపరి విచారణను జనవరి 31కి వాయిదా వేస్తూ, ఈలోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
Go Back to Shorts
New Currency
Delhi High Court
RBI

More Telugu News