కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలని నన్నెవరూ అడగలేదు.. బీసీలే టీడీపీకి వెన్నెముక: అసెంబ్లీలో చంద్రబాబు

  • కాపులకు న్యాయం చేయాలనేదే నా ఆలోచన
  • ఇతర బీసీలకు అన్యాయం జరగదు
  • రాష్ట్ర జనాభాలో కాపు, బలిజ, తెలగ, ఒంటరిలది 11 శాతం
తమకు రిజర్వేషన్లు కల్పించాలని కాపులెవరూ తనను అడగలేదని... అయితే ఆ సామాజికవర్గంలో ఉన్న ఇబ్బందులను చూసి తానే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చానని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. కాపులకు న్యాయం చేయాలనే ఆలోచనతోనే ఈ హామీ ఇచ్చానని చెప్పారు. అసెంబ్లీలో కాపు రిజర్వేషన్లపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మేరకు స్పందించారు. రాష్ట్ర జనాభాలో కాపులు 8.72 శాతం ఉన్నారని తెలిపారు. కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలన్నీ కలిపి 11 శాతం ఉన్నారని చెప్పారు.  బ్రిటీష్ కాలంలో కాపులకు రిజర్వేషన్ ఉండేదని... ఏపీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రిజర్వేషన్లను తొలగించారని తెలిపారు. 2016లో కాపు రిజర్వేషన్లపై కమిషన్ వేశామని చెప్పారు.

ఇతర బీసీలకు అన్యాయం జరగకుండా కొత్తగా 'బీసీ ఎఫ్' ను ఏర్పాటు చేస్తున్నామని... 4 నుంచి 5 శాతం వరకు రిజర్వేషన్లు ఇవ్వచ్చని కమిషన్ సూచించగా, 5 శాతానికే మొగ్గు చూపామని చంద్రబాబు తెలిపారు. బీసీలు లేకుండా తెలుగుదేశం పార్టీనే లేదని ఆయన అన్నారు. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తూ తీర్మానం చేసి, కేంద్రానికి పంపిస్తామని... కేంద్రం దీన్ని షెడ్యూల్ 9లో చేర్చి అమలు చేయాలని చెప్పారు. 
Go Back to Shorts
Chandrababu
kapu reservations
Telugudesam
ap assembly sessions

More Telugu News