Paradise Papers: భారత్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్న పారడైజ్ పేపర్స్ లీక్.. 174 మంది భారతీయులకు ముచ్చెమటలు!

  • తెరపైకి ప్యారడైజ్ పేపర్స్
  • 180 దేశాలకు చెందిన కుబేరుల డేటా లీక్
  • అమెరికా వాణిజ్య మంత్రి పేరు కూడా తెరపైకి
  • గతంలో పనామా పేపర్స్ లీక్‌లో చిక్కుకుని పదవి కోల్పోయిన నవాజ్ షరీప్
  • భారత్‌లో ఇప్పుడిదే హాట్ టాపిక్

‘పనామా పేపర్స్’ సృష్టించిన కల్లోలాన్ని పూర్తిగా మర్చిపోకముందే ‘పారడైజ్ పేపర్స్’ వెలుగులోకి వచ్చి ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. న్యాయ సలహాలు అందించే ‘అప్లెబీ’ అనే సంస్థకు చెందిన డేటా లీకేజీ 714 మంది భారతీయుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. 180 దేశాలకు చెందిన డేటా లీకవగా అందులో సంఖ్యా పరంగా భారత్ 19వ స్థానంలో నిలిచింది. అప్లెబీ ఖాతాదారుల్లో ప్రపంచవ్యాప్తంగా భారతీయులు రెండోస్థానంలో ఉన్నారు. 714 మంది భారతీయ కుబేరులు పన్ను ఎగ్గొట్టిన వారే కావడం గమనార్హం.

పెద్ద నోట్లు రద్దు చేసి ఈ నెల 8కి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వం ‘యాంటీ-బ్లాక్ మనీ డే’ను పాటిస్తోంది. దీనికి రెండు రోజుల ముందే పారడైజ్ పేపర్స్ లీకేజీ సంచలనం సృష్టిస్తోంది. లీకైన డాక్యుమెంట్లలో అమెరికా వాణిజ్య మంత్రి విల్‌బర్ రోస్ పేరు కూడా ఉంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అల్లుడికి చెందిన ‘నేవిగేటర్ హోల్డింగ్స్’లో ఆయనకి వాటా ఉన్నట్టు వెల్లడించింది.

ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ఐసీఐజే) 13.4 మిలియన్ పేపర్లను లీక్ చేసింది. గతంలో పనామా పేపర్స్‌ను లీక్ చేసింది కూడా ఐసీఐజేనే. పన్నుల నుంచి తప్పించుకునేందుకు తమ ఆస్తులను ఎలా దాచుకున్నదీ ఈ పేపర్లలో విపులంగా ఉంది. పేపర్ల లీకేజీపై స్పందించిన ‘అప్లెబీ’ తమ సమాచారం అపహరణకు గురైందని, అయితే తమ వద్ద ఎటువంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేసింది. కాగా, పనామా పేపర్స్ కుంభకోణంలో చిక్కుకున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీప్ తన పదవిని కోల్పోయిన సంగతి తెలిసిందే.

More Telugu News