gang rape: సామూహిక అత్యాచారం జరిగిందంటే పోలీసులు డ్రామలు ఆడుతున్నావన్నారు.. మధ్యప్రదేశ్ అత్యాచార బాధితురాలి ఆవేదన!

  • మధ్యప్రదేశ్ యువతిపై కీచక పర్వం 
  • చదువుకుని ఇంటికి వెళుతుండగా సామూహిక అత్యాచారం
  • నిందితులతో పాటు, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలకు ఆదేశించిన సీఎం

మధ్యప్రదేశ్ లోని భోపాల్ పరిధిలోని హబీబ్ గంజ్ రైల్వే స్టేషన్ వద్ద చోటుచేసుకున్న సామూహిక అత్యాచార ఘటనలో పోలీసులు వ్యవహరించిన విధానం కలకలం రేపుతోంది. దాని వివరాల్లోకి వెళ్తే... ఎంపీ నగర్ ప్రాంతంలో సివిల్స్ కు కోచింగ్ తీసుకుని బాధితురాలు ఇంటికి వస్తుండగా, గోలు, అమర్ అనే ఇద్దరు యువకులు ఆమెను అనుసరించి దాడి చేసి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు.

అక్కడ వారికి గంటూ, రాజేష్ అనే వ్యక్తులు జత కలిశారు. తనను ఏమీ చేయవద్దని ఆమె వేడుకుంటున్నప్పటికీ మూడుగంటల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆమెకు నరకం చూపించారు. ఈ దారుణంపై పోలీసులైన తన తల్లిదండ్రులకు వివరించి, పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు స్టేషన్ కు వెళ్లింది. అయితే ఆమె కట్టుకధలు అల్లుతోందని, మేకప్‌ వేసుకొని సామూహిక అత్యాచారమంటూ నాటకాలాడుతోందని ఒక పోలీస్‌ హేళన చేశారని తెలిపింది.

 దీంతో బాధిత యువతి తన కుటుంబ సభ్యులకు సంఘటనాస్థలి చూపించేందుకు తీసుకెళ్తుండగా, దానికి 500 మీటర్ల దూరంలో కనిపించిన గోలు, అమర్ లను గుర్తుపట్టింది. దీంతో పారిపోతున్న వారిని వెంబడించిన కుటుంబ సభ్యులు, వారిని పట్టుకుని దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు.

దీంతో పరారీలో ఉన్న గంటూ, రాజేష్ ల కోసం గాలింపు చేపట్టి, వారిపై 476 డీ, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని తెలిపారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావడంతో ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ స్పందించారు. ఈ కేసు విచారణ చేసేందుకు ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన బాధిత యువతి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

More Telugu News