satya nadella: మీకు తెలుసా?... గ్రీన్ కార్డు రాక ఇండియాకు వెళ్లి సత్తా చాటిన కునాల్ బాల్... సత్య నాదెళ్ల చెప్పిన ఆసక్తికర అంశం!

  • నా భార్య కోసం గ్రీన్ కార్డు వదిలేశా
  • అదే కార్డు రాక ఇండియాకు కునాల్
  • ఆపై స్నాప్ డీల్ స్థాపన
  • ఇప్పుడు దాని విలువ బిలియన్ డాలర్లు

తనకు సహచరుడిగా మైక్రోసాఫ్ట్ లో పనిచేసిన కునాల్ బాల్ జీవితానికి సంబంధించిన ఓ ఆసక్తికర అంశాన్ని సత్య నాదెళ్ల చెప్పారు. తాను భార్య కోసం గ్రీన్ కార్డును వదిలేస్తే, గ్రీన్ కార్డు రాని పరిస్థితుల్లో ఇండియాకు వెళ్లిపోయిన కునాల్, తన సత్తాను చాటాడని అన్నారు. కునాల్ కు ఉన్న హెచ్-1బీ వీసా గడువు ముగిసిపోవడం, దాన్ని పొడిగించుకునే పరిస్థితి లేకపోవడం, గ్రీన్ కార్డు జారీ కాకపోవడంతో ఇండియాకు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారని గుర్తు చేసుకున్నారు.

ఆపై ఇండియాలో 'స్నాప్ డీల్' అనే ఆన్ లైన్ ఈ-కామర్స్ పోర్టల్ ను ప్రారంభించారని, అదిప్పుడు 5 వేల మందికి ఉపాధిని ఇస్తూ, బిలియన్ డాలర్లకు పైగా నెట్ వాల్యూను కలిగివుందని గుర్తు చేశారు. ఇండియాకు వెళ్లి తనేంటో నిరూపించుకున్న కునాల్ పై తనకెంతో గౌరవం ఉందని తెలిపాడు. మైక్రోసాఫ్ట్ భవిష్యత్తుకు స్నాప్ డీల్ వంటి క్లౌడ్ ఆధారిత కంపెనీలు ఎంతో కీలకమని, ఇవి తమ సంస్థను మరో మెట్టు ఎక్కిస్తాయని భావిస్తున్నానని అన్నారు.

ప్రభుత్వాలు అమలు చేసే పారిశ్రామిక విధానం, ఇన్వెస్ట్ మెంట్స్, ఎంటర్ ప్రెన్యూర్ ల కలయికే దేశాభివృద్ధికి కీలకమని, అదే చైనాను ముందు నిలిపిందని సత్య నాదెళ్ల వెల్లడించారు. ఇదే తరహా పరిణామం ఇప్పుడు ఇండియాలో కనిపిస్తోందని, ఇది భవిష్యత్తుకు శుభ పరిణామమని అన్నారు.

More Telugu News