: 'నాయక్' సినిమాలోని బ్రహ్మానందంలా... ఆపరేషన్ చేసి తిన్నది బయటకు తీయాలని కోరిన డాక్టర్

రామ్ చరణ్, కాజల్ జంటగా నటించిన 'నాయక్' సినిమాలో విలన్ ఇంటికి వచ్చిన బ్రహ్మానందంకు జయప్రకాశ్ రెడ్డి పెద్ద పళ్లెం నిండా భోజనం పెడతాడు. తినాల్సిందే అని ఆర్డరేస్తాడు. దీంతో దానిని తిని ఆసుపత్రి పాలైన బ్రహ్మానందం ఆపరేషన్ చేసి ఫుడ్డు బయటకు తీయాలని డాక్టర్ ను కోరుతాడు. అలాంటి ఘటనే అబుదాబిలో చోటుచేసుకుంది. బంధువుల ఇంట్లో వేడుకకు వెళ్లిన ఒక డాక్టర్ కి వారు పెట్టిన కేక్ బాగా నచ్చింది. దీంతో ఆ కేకులను బాగా తిన్నాడు. కేకులు తిన్న కాసేపటికే కడుపునొప్పి ప్రారంభమైంది. స్వతహాగా డాక్టర్ కావడంతో ఆ ప్రాంతంలో నొప్పి ఎందుకు వస్తోందో గుర్తించి, తనను హుటాహుటీన ఆసుపత్రికి తరలించాలని కోరాడు.

నొప్పి తీవ్రం కావడంతో ఆసుపత్రికి వెళ్లిన డాక్టర్... తన కడుపులో ఏదో పదార్థం ఇబ్బంది పెడుతోందని, ఆపరేషన్ చేసి దానిని తొలగించాలని చెప్పాడు. దీంతో వైద్యులు ఆపరేషన్ చేసి చూడగా, ఆయన కడుపులో కేకుతో పాటు ఇనుపముక్క ఒకటి కనిపించింది. దీంతో వైద్యులు, అతని కుటుంబ సభ్యులు బేకరీ నిర్వాహకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, వేగంగా స్పందించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆ బేకరీపై దాడులు చేసి, అక్కడి కేకుల్లో మరో రెండు మేకు ముక్కలు కనుగొన్నారు. దీంతో అతనిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. 

More Telugu News