ధనుర్మాస వ్రతం

ధనుర్మాస వ్రతం
'ధనుర్మాసం'అనగానే ఉదయాన్నే గుళ్లో మోగే గంటలు ... మైకులో నుంచి వినిపించే దేవుడి పాటలు ... స్వామివారికి నివేదించిన ప్రసాదాలను సంతోషంగా స్వీకరించిన రోజులు గుర్తుకు వస్తాయి. సహజంగానే ధనుర్మాసం (మార్గశిరం - పుష్య మాసపు) రోజులు ప్రత్యేకంగా ... ప్రశాంతంగా ... పవిత్రంగా అనిపిస్తూ వుంటాయి. ఈ కారణంగానే సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించినది మొదలు, భక్తులు ధనుర్మాస వ్రతానికి శ్రీకారం చుడుతూ వుంటారు.

ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువు మధుసూదనుడిగా పిలవబడుతుంటాడు. ఈ వ్రతం చేయాలనుకున్న వారు ఉదయాన్నే నదీ స్నానం చేయాలి. అందుకు అవకాశం లేకపోతే మధుసూదనుడినే మనసారా స్మరిస్తూ బావి దగ్గరే స్నానం చేయాలి. తెల్లవారు జామునే వాకిట్లో ముగ్గులు పెట్టుకోవాలి ... గుమ్మానికి తోరణాలు కట్టుకోవాలి. ఈ నెలంతా కూడా శ్రీ మహా విష్ణువుకి సంబంధించిన కథలు ... పాటలు ... ఆయన లీలలకి సంబంధించిన విషయాలను వింటూ వుండాలి. నిరంతరం ఆయన నామాన్ని జపిస్తూ ధ్యానం చేయాలి.

పులిహొర ... చక్కర పొంగలి ... ఇలా ఒక్కో రోజు స్వామివారికి ఒక్కో ప్రసాదాన్ని నివేదించాలి. ఎవరి స్థాయికి తగినట్టుగా వారు దానధర్మాలు చేయాలి. ఈ విధంగా రంగనాయక స్వామివారిని సేవించినట్టయితే, ఎవరు ఆశించిన ఫలితాలు వారికి దక్కుతాయని మహర్షులు సెలవిచ్చారు.

More Bhakti Articles