వనభోజనాలు

వనభోజనాలు
సాధారణంగా కార్తీక మాసం రాగానే వివిధ ప్రాంతాలవారు తమ సన్నిహితులతో కలిసి, వన భోజనాలకు వెళుతూ వుండటం ఓ ఆచారంగా వస్తోంది. నాలుగు గోడల మధ్య ఏదో ఒక సమయంలో ఎవరికి వారుగా వచ్చి భోజనం చేసేసి బయటపడిపోతున్న ఈ రోజుల్లో, ఈ వనభోజనాలు ఓ వరంలా అనిపించడం సహజం.

కార్తీక మాసంలో హరిహరులను పూజించి, ఆ తరువాత సపరివార సమేతంగా వనభోజనాలకు వెళ్లాలి. 'ఉసిరిచెట్టు'ను పూజిస్తే సమస్త పుణ్యక్షేత్రాలను పూజినట్టు అవుతుందని పురాణాలు చెప్పిన కారణంగా వాటిని పూజించాలి. ఉసిరిచెట్టు కింద కూర్చుని శివకేశవుల లీలావిశేషాలను గురించి మాట్లాడుకుంటూ ఆధ్యాత్మిక చింతన చేయాలి. ఈ సమయంలో పురాణ కాలక్షేపం చేయడంవల్ల అనంతమైన పుణ్య ఫలాలు ప్రాప్తిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

ఇక ఆధ్యాత్మిక విషయాలను అటుంచితే, ఆరోగ్య పరంగా కూడా వనభోజనాలు ఎంతో మేలు చేస్తాయని వైద్య శాస్త్రం చెబుతోంది. ఔషధ గుణాలను కలిగివున్న ఉసిరిచెట్టు మీదుగా వచ్చే గాలి శ్వాస సంబంధమైన వ్యాధులను దూరం చేస్తుంది. ఇక నలుగురితో కలిసి వన భోజనాలకి వెళ్లడం వలన అందరం ఒకటేననే సమైక్యతా భావం కలుగుతుంది. అనుబంధాలు ... అభిమానాలు పెరిగి ఆపద సమయాల్లో ఒకరికి ఒకరు అండదండగా ఉండే పరిస్థితులు ఏర్పడతాయి. ఆధ్యాత్మికత ... మానసిక ఉల్లాసం ... అనుబంధాలు ... ఇవే వనభోజనాల వెనుకగల అసలైన అర్ధాలు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

More Bhakti Articles