దైవారాధనకి ఇది తగిన సమయం !

దైవారాధనకి ఇది తగిన సమయం !
సాధారణంగా ఉదయాన్నే నిద్రలేచి .. స్నానం చేసి ... పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి ఇష్టదైవాన్ని పూజించడం చేస్తుంటారు. ఒక్కోరోజు ఒక్కో నైవేద్యాన్నీ ... లేదంటే వివిధ రకాల ఫలాలను స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తుంటారు. అన్నివేళలలోను తనకి అండగా ఉండమని భగవంతుడికి నమస్కరిస్తూ వుంటారు.

అయితే 'బ్రాహ్మీ ముహూర్తం'లో దైవారాధన విశేషమైన ఫలితాలను ఇస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఇక 'ఉషః కాలం'లో నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని భగవంతుడిని ఆరాధించడం వలన అనంతమైన ఫలితాలు ఉంటాయని అంటూ వుంటారు. ఈ నేపథ్యంలోనే 'ప్రదోష కాలం' అనే పేరు వినిపిస్తుంది. ఈ సమయంలో శివుడిని పూజించడం వలన ఆయన అనుగ్రహం లభిస్తుందని చెబుతుంటారు.

అయితే ప్రదోష కాలం ... ఉషః కాలం ... బ్రాహ్మీ ముహూర్తం గురించిన సమయాల్లో కొంతమందికి స్పష్టత లేకపోవడం జరుగుతూ వుంటుంది. వాటి గురించి తెలుసుకుని అనుసరించాలని వాళ్లు ఆరాటపడుతూ వుంటారు. సూర్యాస్తమయం నుంచి 2 గంటల 24 నిమిషాల సమయాన్ని ప్రదోష కాలంగా చెప్పడం జరుగుతోంది.

ఈ సమయంలో కైలాసంలో శివుడు నాట్యం చేస్తూ ఉంటాడట. ఆ నాట్యాన్ని తిలకించడానికి సమస్త దేవతలు అక్కడే ఉంటారు. అందువలన ఈ సమయంలో చేసిన శివ పూజ విశేష ఫలితాలను ఇస్తుందని చెప్పబడుతోంది. ఇక ఉషః కాలం అంటే ... సూర్యోదయానికి 2 గంటల ముందు సమయం. ఈ సమయంలోనే 'బ్రాహ్మీ ముహూర్త కాలం' కూడా కలిసి ఉంటుంది. సూర్యోదయానికి ముందుగా గల 1 గంట 36 నిమిషాల కాలాన్ని 'బ్రాహ్మీముహూర్త కాలం' గా చెప్పబడుతోంది.

'బ్రాహ్మీ' అంటే సరస్వతి ... ప్రశాంతమైన ఈ సమయంలో బుద్ధి బాగా వికసిస్తుంది కాబట్టి దీనిని 'బ్రాహ్మీ ముహూర్తం' అంటారు. ఇది భగవంతుడి పట్ల మనసును నిలపడానికి అనుకూలమైన కాలం. ఈ కాలంలో నిద్రలేవడం వలన ఆరోగ్యం స్థిరంగా ఉంటుందనీ ... ఆయుష్షు పెరుగుతుందని అంటారు. ఈ సమయంలో దైవారాధన చేయడం వలన అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని చెబుతుంటారు.

More Bhakti Articles