దైవనామ స్మరణ ఎప్పుడైనా చేయవచ్చా ?

దైవనామ స్మరణ ఎప్పుడైనా చేయవచ్చా ?
భగవంతుడిని అనునిత్యం ఆరాధించడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆయన మనకి అండగా ఉన్నాడనే విశ్వాసం పెరుగుతుంది. ఆయన అనుగ్రహాన్ని ఆశించే భక్తులంతా ఉదయాన్నే ఆయన్ని పూజిస్తూ వుంటారు. భగవంతుడిని షోడశ ఉపచారాలతో పూజించాలి. తప్పనిసరి పరిస్థితుల్లో పంచోపచారాలు చెప్పబడ్డాయి. ఈ నియమం ప్రకారం చేయబడిన పూజ వల్లనే పరిపూర్ణమైన ఫలితం దక్కుతుంది.

భగవంతుడిని పూజించడానికి నియమాలు ఉన్నట్టుగానే, ఆయన నామాన్ని స్మరించడానికి కూడా నియమాలు ఉంటాయా ? అనే సందేహం భక్తులలో తలెత్తుతూ వుంటుంది. ఏ సమయంలో పడితే ఆ సమయంలో దైవ నామస్మరణ చేయవచ్చా? అనే అనుమానం కలుగుతూ వుంటుంది. 'స్మరణ' అనేది నవవిధ భక్తి మార్గాలలో ఒకటిగా చెప్పబడుతోంది. అనుక్షణం దైవనామ స్మరణ చేస్తూ ఆయన మనసులో స్థానం సంపాదించుకున్న భక్తులు ఎంతోమంది వున్నారు.

పూజ చేయడానికీ ... జపం చేయడానికి ఉన్నట్టుగా, భగవంతుడి నామస్మరణ చేయడానికి ఎలాంటి నియమాలు ఉండవని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఏ వేళలోనైనా ... ఎలాంటి పరిస్థితుల్లో వున్నా ... తమ దైనందిన కార్యక్రమాలు ధర్మబద్ధంగా నిర్వహిస్తూనే దైవనామ స్మరణ చేయవచ్చని స్పష్టం చేస్తున్నాయి.

More Bhakti Articles