సిరిసంపదలను ప్రసాదించే శ్రీ వేంకటేశ్వరుడు

సిరిసంపదలను ప్రసాదించే శ్రీ వేంకటేశ్వరుడు
తన హృదయంలోనే లక్ష్మీదేవికి నివాస స్థానాన్ని కల్పించడం వలన, వేంకటేశ్వరస్వామి ఎక్కడ వుంటే అక్కడ సిరులు కురుస్తూ వుంటాయి. ఆయన కొలువైన ఆలయాలు అనునిత్యం భక్తుల సందడితో కళకళలాడుతూ అంగరంగ వైభవంగా వెలుగొందుతూ వుంటాయి. అలాంటి విశిష్టమైన ఆలయాల జాబితాలో భిలాయ్ లోని బాలాజీ మందిరం ఒకటిగా కనిపిస్తుంది. ఉక్కు కర్మాగారం సమీపంలో ఈ ఆలయం అలరారుతోంది.

'ఆంధ్ర సాహిత్య సమితి' గా ఏర్పడిన ఇక్కడి భక్తులు ఈ ఆలయ నిర్మాణంలో కీలకమైన పాత్రను పోషించారు. అలా నలభై సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఈ ఆలయం అంచెలంచలుగా అభివృద్ధి చెందుతూ వస్తోంది. గర్భాలయంలో స్వామివారు మాత్రమే కొలువై వుండగా, ప్రత్యేక మందిరాల్లో పద్మావతీదేవి ... గోదాదేవి అమ్మవార్లు పూజలందుకుంటూ వుంటారు. అందమైన రాజ గోపురాన్ని దాటుకుని లోపలికి అడుగుపెడితే, ఆకర్షణీయంగా తీర్చిదిద్దబడిన ఆలయం ఆధ్యాత్మిక భావాలను వికసింపజేస్తూ దర్శనమిస్తుంది.

ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతోన్న ఈ ఆలయాన్ని దర్శిస్తే సకల శుభాలు కలుగుతాయని చెబుతుంటారు. స్వామివారికి కల్యాణం జరిపించడం వలన మొక్కుబడి తీర్చుకునే భక్తులు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ వుంటారు. ఈ కారణంగా ఇక్కడ స్వామి తన దేవేరులతో కలిసి నిత్య కళ్యానోత్సవాలతో నయనానందకరంగా దర్శనమిస్తూ వుంటాడు. ఉగాది ... శ్రీరామనవమి ... దసరా వంటి పర్వదినాల సమయంలో ఇక్కడ జరిగే ప్రత్యేక పూజల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొంటూ వుంటారు ... స్వామివారి సేవలో సంతోషంగా తరిస్తుంటారు.

More Bhakti Articles