దైవానుగ్రహమే దుఃఖాన్ని నివారించగలదు

దైవానుగ్రహమే దుఃఖాన్ని నివారించగలదు
ఆర్ధికపరమైన ఇబ్బందులు ... ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎంతటివారినైనా అతలాకుతలం చేస్తుంటాయి. అలాంటి పరిస్థితుల నుంచి బయటపడటానికి భగవంతుడి అనుగ్రహమే తప్ప మరోమార్గం కనిపించదు. ఇందుకు ఎన్నో ఉదాహరణలు ... మరెన్నో నిదర్శనాలు లేకపోలేదు. 'సుమేధ' ఎదుర్కున్న విషమ పరిస్థితులు కూడా ఈ విషయాన్ని చాటిచెబుతుంటాయి.

సుగుణాల రాశియైన సుమేధను భర్త అనారోగ్యం మానసికంగా కుంగదీస్తూ వుంటుంది. ఒకదాని తరువాత ఒకటిగా వివిధ రకాల వ్యాధులు ఆయనని చుట్టుముడుతూ ఉండటంతో, ఆమె తీవ్రమైన ఆందోళనకు లోనవుతుంది. ఈ గండం నుంచి ఏ దేవుడు తమని గట్టెక్కిస్తాడా అని ఆమె ఎదురుచూస్తూ వున్న సమయంలోనే, దత్తాత్రేయస్వామి భక్తుడైన 'విష్ణుదత్తుడు' ఆ గ్రామానికి వస్తాడు.

ఆ దత్త భగవానుడే ఆయనని ఆ ఊరికి పంపించాడని భావించి ఆమె ఆనందంతో పొంగిపోతుంది. విష్ణుదత్తుడిని కలుసుకుని, తన ఆవేదనను వ్యక్తం చేస్తుంది. తన భర్తను కాపాడుకోవడం కోసం ఆమె పడుతోన్న ఆరాటం విష్ణుదత్తుడి మనసును కదిలించివేస్తుంది. పూర్వజన్మలో చేసిన పాపాలే ఈ జన్మలో వ్యాధుల రూపంలో పట్టిపీడిస్తూ ఉంటాయని విష్ణుదత్తుడు చెబుతాడు. దుఃఖాన్ని శాశ్వతంగా నివారించే శక్తి ఒక్క దైవానుగ్రహానికే ఉందని అంటాడు.

సౌభాగ్యాన్ని సుస్థిరం చేయవలసిందిగా కోరుతూ వ్రతాలను ఆచరించమని సుమేధతో చెబుతాడు. నిరంతరం దత్త నామాన్ని ఆమె భర్త స్మరించేలా చూడమని అంటాడు. విష్ణుదత్తుడి మాటలపట్ల పూర్తి విశ్వాసాన్ని వుంచి, ఆయన చెప్పినట్లుగా చేస్తుంది సుమేధ. ఆమె భర్త కూడా దత్త నామాన్ని అదే పనిగా స్మరిస్తూ వుంటాడు. అలా కొంతకాలం గడిచే సరికి ఆమె భర్తకి అన్ని వ్యాధుల బారి నుంచి విముక్తి లభిస్తుంది.

అచెంచలమైన భక్తి విశ్వాసాలకు ... అసమానమైన అంకితభావానికి భగవంతుడు వశుడవుతాడని సుమేధ అనుభవపూర్వకంగా తెలుసుకుంటుంది. భగవంతుడి నామస్మరణంలోని గొప్పతనం ... వ్రతాలను ఆచరించడం వలన కలిగే ఫలితం గురించి తమకి తెలిపిన విష్ణుదత్తుడిని ఆ దంపతులు కలుసుకుంటారు. తమ జీవితాన్ని నిలబెట్టినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన పాదాలకు నమస్కరిస్తారు.

More Bhakti Articles