భక్తుడి ఆనందమే భగవంతుడికి సంతోషం

భక్తుడి ఆనందమే భగవంతుడికి సంతోషం
దేవుడు ఒక్కడే అయినా ఆయనని అనేక రూపాలలో ఊహించుకుంటూ ... వివిధ నామాలతో ముచ్చటగా పిలుచుకుంటూ ఎంతోమంది భక్తులు తరించారు. నవవిధ భక్తి మార్గాలలో ఎవరికి తోచిన మార్గాన్ని వాళ్లు ఎంచుకుని, ఆ పరమాత్ముడి హృదయంలో శాశ్వతమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. అలా ఆ కృష్ణ పరమాత్ముడిని తన రచనలతో కీర్తిస్తూ ... ఆలపిస్తూ తన జీవితాన్ని చరితార్థం చేసుకున్న మహాభక్తుడుగా 'జయదేవుడు'కనిపిస్తాడు.

కృష్ణ భగవానుడిపట్ల తనకు గల ఇష్టాన్ని ఆయన 'గీతాగోవిందం' అనే రచన ద్వారా ఆవిష్కరించాలని నిర్ణయించుకుంటాడు. జయదేవుడు నిరంతరం ఆ స్వామి ఆలోచనలో వుంటూనే తన రచన కొనసాగిస్తూ వుంటాడు. గంగాప్రవాహంలా సాగిపోతున్న ఆయన రచన ఒకచోట హఠాత్తుగా ఆగిపోతుంది. ఆ శ్లోకంలో ఏ పద సముదాయాన్ని వాడదామన్నా ఔచిత్య భంగం కలుగుతుందని ఆయన భావిస్తాడు. సరైన పదాలతో ఆ శ్లోకాన్ని ఎలా పూర్తి చేయాలనే విషయాన్ని గురించి ఆలోచిస్తూ, అక్కడికి దగ్గరలో గల ఉద్యానవనంలోకి వెళతాడు.

అలా కొంతసేపు అక్కడ పచార్లు చేసిన ఆయన, ఆ శ్లోకాన్ని పూర్తి చేసే ఆలోచన రావడంతో ఇంటికి తిరిగివస్తాడు. కానీ అప్పటికే ఆ శ్లోకం పూర్తి చేసి వుండటం చూసి ఆశ్చర్యపోతాడు. భార్యను పిలిచి ఆ విషయాన్ని గురించి అడగగా, అంతకుముందు ఆయనే ఆ శ్లోకాన్ని రాస్తుండగా తాను చూశానని చెబుతుంది. దాంతో ఆ పరమాత్ముడే తన రూపంలో వచ్చి ఆ శ్లోకాన్ని పూర్తిచేశాడనే విషయం జయదేవుడికి అర్థమైపోతుంది. ఆనందంతో పొంగిపోతూ ఆయన ఆ భగవంతుడి పాదాలచెంత వాలిపోతాడు.

More Bhakti Articles