మంచి భర్తను పొందాలంటే ఏంచేయాలి ?

మంచి భర్తను పొందాలంటే ఏంచేయాలి ?
వివాహం కావలసిన ప్రతి యువతి కూడా తనకి కాబోయే భర్తను గురించి కలలు కంటూ వుంటుంది. తనకి లభించే భర్త మంచి అలవాట్లను ... అభిరుచులను కలిగి వుండాలని కోరుకుంటుంది. తనని ప్రేమానురాగాలతో చూసుకోవడమే కాకుండా, నలుగురిలో ఉన్నతమైన స్థానాన్ని కలిగివుండాలని ఆశపడుతుంది.

అందమైన రూపం ... అందుకు తగిన మంచి మనసు ... ప్రతిభావంతుడై వుంటే, తన వైవాహిక జీవితం సంతోషకరంగా సాగిపోతుందని భావిస్తుంది. మరి ఇన్ని అర్హతలుగల భర్త లభించాలంటే మాటలా ? అందుకు ఎంతో పుణ్యం చేసుకుని వుండాలి. అలాంటి పుణ్యాన్ని ప్రసాదించే వ్రతంగా 'రంభావ్రతం' చెప్పబడుతోంది.

అరటిచెట్టును సంస్కృతంలో 'రంభా' అంటారు ... రంభా వ్రతమంటే అరటిచెట్టును ఆరాధించడమే. బ్రహ్మదేవుడు భార్య అయిన సావిత్రి అరటిచెట్టు రూపంలో ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. 'జ్యేష్ఠ శుద్ధ తదియ' రోజున అరటిచెట్టు రూపంలో వున్న సావిత్రిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించాలి. పెరట్లో గల అరటిచెట్టు ముందు అలికి ముగ్గులు పెట్టి, సావిత్రిదేవి ప్రతిమను పీఠంపై వుంచి అలంకరించాలి. అమ్మవారిని షోడశ ఉపచారాలతో పూజించి పాయసాన్ని... పిండి వంటలను నైవేద్యంగా సమర్పించాలి.

మొదటి రోజున మాత్రమే జాగరణ చేసి నెల రోజుల పాటు సావిత్రి దేవిని ఆరాధిస్తూనే గడపాలి. ప్రతి రోజు దంపతులకు దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి. లోపాముద్ర ఈ వ్రతాన్ని ఆచరించడం వల్లనే అగస్త్య మహర్షిని భర్తగా పొందిందని తెలుసుకున్న పార్వతీదేవి, ఈ వ్రతాన్ని ఆచరించి పరమశివుడిని భర్తగా పొందింది. సాక్షాత్తు పార్వతీదేవి ఈ వ్రతాన్ని ఆచరించిందంటే, లయకారకుడైన సదాశివుడినే భర్తగా పొందిందంటే ఈ వ్రతమహాత్మ్యం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

More Bhakti Articles