వివాహ సమస్యలు తొలగించే విశిష్ట క్షేత్రం

వివాహ సమస్యలు తొలగించే విశిష్ట క్షేత్రం
సాధారణంగా ఒకరి జీవితం ఒకరికి ఆనందంగా ఉన్నట్టుగా అనిపిస్తూ వుంటుంది. కానీ ఎవరి కష్టాలు వాళ్లు ... ఎవరి బాధలు వాళ్లు పడుతుంటారు. కొంతమంది పైకి చెప్పుకుంటే, మరికొందరు మనసులోనే దాచుకుంటారు. ఇలా ఏదో ఒక సమస్యతో బాధపడుతోన్నవాళ్లు భగవంతుడి అనుగ్రహం కోసం ఆయా పుణ్యక్షేత్రాలను దర్శిస్తుంటారు. ఈ నేపథ్యంలో వివాహ సంబంధమైన సమస్యలతో సతమతమైపోతున్న వాళ్లు 'తిరువిడందై' క్షేత్రానికి వెళుతూ వుంటారు.

తమిళనాడు - ప్రాంతానికి చెందిన ఈ క్షేత్రంలో లక్ష్మీవరాహస్వామి దర్శనమిస్తూ వుంటాడు. అమ్మవారు కోమలవల్లీ తాయారు పేరుతో ప్రత్యేక మందిరంలో కొలువుదీరి కనిపిస్తూ వుంటుంది. 108 వైష్ణవ దివ్య క్షేత్రాల్లో ఒకటిగా చెప్పబడుతోన్న ఈ ఆలయాన్ని పల్లవులు నిర్మించినట్టు ఆధారాలు వున్నాయి. ఆనాటి నిర్మాణ రీతులు భక్తులకు అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తూ వుంటాయి. ఇక్కడ గల 'కళ్యాణ తీర్థం' మహిమాన్వితమైనదిగా చెప్పబడుతోంది.

స్వామిని నిత్యకల్యాణ పెరుమాళ్ పేరుతో కొలుస్తుంటారు. ఈ విధంగా పిలవడానికి వెనుక కారణం లేకపోలేదు. శ్రీమహావిష్ణువు భక్తుడైన 'గాలవ మహర్షి'కి 360 మంది కుమార్తెలు వుండేవారట. వారిని ఆ స్వామికే ఇచ్చి వివాహం జరిపించాలని మహర్షి సంకల్పించాడు. స్వామివారి కోసం అనేక సంవత్సరాలు తపస్సుచేసి ఆయన సాక్షాత్కారాన్ని పొందాడు. తన కూతుళ్లను పరిణయమాడి తన ముచ్చట తీర్చవలసిందిగా కోరాడు. ఆ మహర్షి మాట కాదనలేక రోజుకి ఒకరిని చొప్పున స్వామి వివాహం చేసుకున్నాడట. ఇలా ఒక్కో రోజు ఒక్కొక్కరిని వివాహం చేసుకున్నందు వలన స్వామిని 'నిత్యకళ్యాణ పెరుమాళ్' గా పూజిస్తుంటారు.

వివాహం ఆలస్యమవుతోన్న వాళ్లు ఈ స్వామిని దర్శించడం వలన, అనతికాలంలోనే వారికి మంచి సంబంధం లభించి వివాహం జరిగిపోతుంది. ఇక వైవాహిక జీవితం సవ్యంగా సాగని వాళ్లు స్వామి దర్శనం చేసుకోవడం వలన, అపార్థాలు తొలగిపోయి ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. అనేకమంది విషయంలో ఇది నిజమైనట్టుగా వారి అనుభవాలను బట్టి తెలుస్తోంది. బలమైన ఈ విశ్వాసం కారణంగా ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా వుంటుంది. విశేషమైన పుణ్య తిథుల్లో స్వామివారికి జరిగే ఉత్సవాలు ... వాహన సేవలు చూసితీరవలసిందే.

More Bhakti Articles