ఆపదలో పిలిస్తే ఆదుకునే దేవుడు బాబా

ఆపదలో పిలిస్తే ఆదుకునే దేవుడు బాబా
శిరిడీ సాయిబాబా మహిమలు అందరి అనుభవాల్లోను కనిపిస్తుంటాయి. అందువల్లనే భక్తులకు ఆయనపట్ల విశ్వాసం అనతకంతకూ పెరుగుతోంది. అదేస్థాయిలో ఆయన ఆలయాల సంఖ్యకూడా పెరుగుతూపోతోంది. బాబా ఆలయాన్ని ఎవరు .. ఎక్కడ నిర్మించినా అది ఒక ప్రశాంత నిలయంగా అనిపిస్తుంది ... ఒక ప్రేమ సామ్రాజ్యంగా కనిపిస్తుంది.

అన్నిరకాల అనారోగ్యాలకు మనశ్శాంతిని మించిన మందులేదని పెద్దలు చెబుతుంటారు. అలాంటి మనశ్శాంతిని అందించే ఆరోగ్య కేంద్రాలుగా కూడా బాబా ఆలయాలు విరాజిల్లుతున్నాయి. అలా నిర్మించబడిన బాబా ఆలయాలలో ఒకటి మహబూబ్ నగర్ జిల్లా 'మెట్ పల్లి'లో దర్శనమిస్తుంది. రాజాధిరాజుగా అశేష భక్తుల హృదయాలలో బాబా చోటు సంపాదించుకున్నాడు. ఒక భక్తుడు సంకల్పానికి నిలువెత్తు నిదర్శనంగా ఇక్కడ ఆయన ఆలయం కనిపిస్తూ ఉంటుంది.

ఆహ్లాదకరమైన వాతావరణంలో ... సువిశాలమైన ప్రదేశంలో ఈ ఆలయాన్ని తీర్చిదిద్దిన తీరు భక్తుల కళ్లను కట్టిపడేస్తుంది. మిగతా ఆలయాలలో మాదిరిగా బాబా ఓ వేదికపై కాకుండా, గర్భాలయంలో వుండటం ఇక్కడి ప్రత్యేకత. శిరిడీలో మాదిరిగానే ప్రతినిత్యం బాబాకి అభిషేకాలు ... హారతులు ... అలంకారాలు జరుగుతుంటాయి. ఇక గురువారం రోజున ఘనంగా నిర్వహించే ప్రత్యేక సేవలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు.

ఇక్కడి సాయిపట్ల స్థానికులు అచెంచలమైన విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు. ఆపదలో పిలిస్తేచాలు ఆ సాయి వెంటనే పలుకుతాడనీ, ఆ గండం నుంచి గట్టెక్కిస్తాడని చెబుతుంటారు. అందుకు ఉదాహరణగా తమ అనుభవాలను వివరిస్తుంటారు. తమని కంటికి రెప్పలా కాపాడుతోన్న సాయికి తాము ఏలోటూ రానీయకుండా చూసుకుంటామంటూ ఆయన పట్ల తమకి గల అనంతమైన అనురాగాన్ని ఆవిష్కరిస్తూ వుంటారు.

More Bhakti Articles