తిరుమల వేంకటేశ్వరుడి లీలావిశేషం !

తిరుమల వేంకటేశ్వరుడి లీలావిశేషం !
శ్రీ వేంకటేశ్వరస్వామి ఆదేశం మేరకు ఆయనని పూజించేందుకు విఖనస మహర్షి తిరుమలకు చేరుకుంటాడు. అక్కడే ఆయనకి 'రంగదాసుడు' అనే భక్తుడితో పరిచయం ఏర్పడుతుంది. రంగదాసుడి భక్తి శ్రద్ధలు ... వినయ విధేయతలు చూసి మహర్షి ఎంతగానో సంతోషిస్తాడు. స్వామివారి సేవకు తగిన భక్తుడు లభించాడని ఆనందంతో పొంగిపోతాడు. ఇక రంగదాసుడు కూడా స్వామివారి సేవకుగాను తనకి సరైన మార్గం చూపించే వ్యక్తి దొరికినందుకు ఆనందిస్తాడు.

స్వామివారికి మహర్షి నిత్యపూజలు నిర్వహిస్తూ ఉండగా, అందుకు అవసరమైన పూజా ద్రవ్యాలను రంగదాసు సమకూరుస్తూ ఉండేవాడు. ఒక రోజున ఆయన పూలు - పండ్లు సేకరించడానికి వెళతాడు. స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించడానికి, అనేక రకాల పండ్లతో నైవేద్యాలు సమర్పించడానికి తోటను పెంచాలనే కోరిక ఆ సమయంలోనే ఆయనకి కలుగుతుంది. అందుకు అవసరమైన నీటి కోసం ఆయన ఎంతో కష్టపడి బావిని తవ్వుతాడు. మహర్షి పూజా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్న సమయంలో, ఆయన ఆ పనిని పూర్తి చేస్తాడు. ఆనాటి నుంచి ఆ తోటను కంటికి రెప్పలా కాపాడుకుంటూ రాసాగాడు.

అలాంటి పరిస్థితుల్లో ఒకరోజున పూజా ద్రవ్యాల కోసం వెళ్లిన రంగదాసుడు, స్వామి పుష్కరిణిలో గంధర్వ దంపతులు జలకాలడుతూ ఉండటాన్ని చూస్తూ అక్కడే నిలబడిపోతాడు. పూజకి వేళ మించిపోయిన తరువాత ఆ విషయం గుర్తుకు వచ్చి తిరిగివస్తాడు. స్వామివారి పాదాలపై పడి తన వలన జరిగిన పొరపాటుకు పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తాడు. అయినా ఆయన చేసిన సేవలను దృష్టిలో ఉంచుకున్న స్వామివారు ఆగ్రహించకుండా అనుగ్రహిస్తాడు.

ఈ జన్మను చాలించి మరుజన్మలో తన భక్తుడిగా తన ఆలయ నిర్మాణ బాధ్యతను చేపట్టవలసిందిగా ఆదేశిస్తాడు. అందుకు రంగదాసుడు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. ఆ తరువాత'తొండమానుడు'గా జన్మించి స్వామివారికి మహాభక్తుడై ఆయనకి ఆలయాన్ని నిర్మించి సంతోషంగా సమర్పిస్తాడు. అలా శ్రీవేంకటేశ్వరస్వామి లీలావిశేషం కారణంగా, రంగదాసుడుకి రెండు జన్మలలోనూ స్వామివారి సేవచేసుకునే భాగ్యం లభించింది.

More Bhakti Articles