మనసును అదుపులో పెట్టకపోతే ?

మనసును అదుపులో పెట్టకపోతే ?
మనసనేది మనిషిని తన అధీనంలో పెట్టుకుని అతణ్ణి తన ఇష్టానుసారంగా నడిపించాలని చూస్తూవుంటుంది. ఉత్తములు ఆ విషయాన్ని గ్రహించి ఆ మనసుకి కళ్ళెంవేసి దానిని తమ అధీనంలో ఉంచుతుంటారు. మనసు అదుపులో వుంటే కీర్తిప్రతిష్ఠలు కలుగడమే కాకుండా, ఉన్నతమైన జీవితం సొంతమవుతుంది. ఇక ఆ మనసుపై నియంత్రణ కోల్పోతే పరాభవమే మిగులుతుంది. ఇందుకు ఉదాహరణగా నిలిచే వాళ్లలో సామాన్యులే కాదు, దేవతలు ... మహర్షులు ... మహారాజులు సైతం కనిపిస్తారు.

దేవేంద్రుడు విషయంలోనూ ఇందుకు మనకి మినహాయింపు కనిపించదు. ఒకసారి దేవేంద్రుడు భూలోకంలో విహరిస్తూ, అంబరీషుడు భార్య అయిన కల్యాణిని చూస్తాడు. ఆమె మహా సౌందర్యం చూసి ఆయన మనసు చలిస్తుంది. అంబరీషుడు శ్రీమహావిష్ణువుకి మహా భక్తుడనీ, ఆయన భార్య కల్యాణి మహా పతివ్రతే కాకుండా జగన్మాత భక్తురాలని తెలుసుకుంటాడు. ఆ దంపతులు రాజ్యభోగాలను సైతం వదిలి ఆశ్రమ జీవితాన్ని గడుపుతున్నారని తెలిసి ఆశ్చర్యపోతాడు.

కల్యాణి సౌందర్యమే కనులముందు కదలాడుతూ ఉండటంతో దేవేంద్రుడు తన మనసు పై నియంత్రణ కోల్పోతాడు. ఎలాగైనా కల్యాణిని దక్కించుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఒకసారి అంబరీషుడు ఆశ్రమంలో లేని సమయం చూసి ఆయన రూపంలో అక్కడికి వెళతాడు. వచ్చినది తన భర్తగా భావించిన కల్యాణి, ఆ వెంటనే ఆయన ధోరణిలో మార్పును గ్రహిస్తుంది. దాంతో బలవంతంగా ఆమెను వశపరచుకోవడం కోసం దేవేంద్రుడు ప్రయత్నిస్తాడు. కల్యాణి ఆ జగన్మాతను ప్రార్ధించడంతో ఒక్కసారిగా దేవేంద్రుడిని అగ్నిజ్వాలలు చుట్టుముడతాయి. వాటి బారి నుంచి బయటపడటానికి ఆయన ఎంతగా ప్రయత్నిస్తున్నా ప్రయోజనం లేకపోతుంది.

దేవేంద్రుడు పరాభవానికి గురైన విషయం దేవలోకంలో గుప్పుమంటుంది. విషయం తెలుసుకున్న దేవేంద్రుడి భార్య క్షణాల్లో అంబరీషుడి ఆశ్రమానికి చేరుకుంటుంది. తన భర్త చేసిన తప్పును పెద్ద మనసుతో క్షమించమని కల్యాణిని వేడుకుంటుంది. ఆమె దయచూపడంతో దేవేంద్రుడు ఆ మంటల నుంచి బయటపడతాడు. మరోమారు ఇలాంటి తప్పుచేయనని కల్యాణి దగ్గర పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసిన దేవేంద్రుడు, భార్యతో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అలా ఈ సంఘటన .. మనసుని అదుపులో పెట్టుకోలేనివారికి పరాభవం తప్పదని మరోసారి రుజువు చేస్తోంది.

More Bhakti Articles