శాపాల బారినుంచి బయటపడే మార్గం ?

శాపాల బారినుంచి బయటపడే మార్గం ?
తెలిసో తెలియకో చేసిన పాపాల కారణంగా కొందరు శాపాల బారిన పడుతుండటం ... మరికొందరేమో మహర్షుల తొందరపాటు కారణంగా శాపాలకి గురవుతుండటం మనకి పురాణాల్లో కనిపిస్తూ వుంటుంది. కారణమేదైనా శాపాల బారినపడిన వాళ్లను భగవంతుడు మాత్రమే రక్షించగలుగుతాడనేది నిజం. ఆయన అనుగ్రహానికి నోచుకోవాలంటే ఓ భక్తుడిగా ఆయన మనసు గెలుచుకోవలసి ఉంటుంది.

శాపాల బారినుంచి బయటపడటానికి అంతకుమించిన మార్గం లేదని నిరూపించిన మహాభక్తులలో 'అంబరీషుడు' ఒకరుగా ప్రధానంగా కనిపిస్తాడు. దూర్వాస మహాముని శాప ఫలితంగా అంబరీషుడు ఆయన భార్య కల్యాణి చెరోదారి అవుతారు. సోదరుడి కారణంగా రాజ్యం నుంచి గెంటివేయబడిన అంబరీషుడు, ఆ శ్రీహరిని స్మరిస్తూ అడవులలో తిరగసాగాడు. తన భర్త ఎక్కడ ఉన్నాడో .. ఆయనని ఎలా చేరుకోవాలో తెలియక కల్యాణి ఆవేదన చెందుతూ వుంటుంది.

కారడవులలో అలుపనేది లేకుండా తిరిగిన కారణంగా అంబరీషుడుకి దాహం వేస్తుంది. ఎక్కడా నీటి చుక్క కనిపించకపోవడంతో ఆయన సొమ్మసిల్లి పడిపోతాడు. తన భర్తను వెదుక్కుంటూ బయలుదేరిన కల్యాణి కూడా దాహం కారణంగా సృహ కోల్పోతుంది. తన భక్తులకు వచ్చిన కష్టాకాలాన్ని తొలగించడానికి శ్రీమన్నారాయణుడు సతీ సమేతంగా భూలోకానికి వస్తాడు. అడవిలో ఉన్న ఆ దంపతులిద్దరినీ ఒక చోటుకి చేర్చడమే కాకుండా, వారి దాహాన్ని తీర్చడం కోసం జలపాతాన్ని సృష్టిస్తాడు.

జలపాతం హోరుకు అంబరీషుడు .. ఆయన భార్య ఈ లోకంలోకి వస్తారు. ఒకరిని ఒకరు చూసుకుని ఆనందాశ్చర్యాలకి లోనవుతారు. తమని కలిపింది ఆ లక్ష్మీనారాయణులేనని గ్రహించి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుతూ దాహం తీర్చుకుంటారు. రాజ్య భోగాలపై ఎలాంటి ఆశ ... ఆసక్తిలేని ఆ దంపతులు అక్కడే ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుంటారు. నిరంతరం శ్రీహరి నామస్మరణచేస్తూ తమ జీవితాన్ని ఆనందంగా కొనసాగిస్తారు.

More Bhakti Articles