భగవంతుడి నైవేద్యంపట్ల శ్రద్ధ

భగవంతుడి నైవేద్యంపట్ల శ్రద్ధ
భగవంతుడికి జరిపే పదహారు ఉపచారాలలో 'నైవేద్యం' ఒకటిగా కనిపిస్తూ వుంటుంది. అయితే ఆ నైవేద్యాన్ని ఎంత పవిత్రంగా తయారు చేశాం ... ఎంత పరిశుభ్రతతో సమర్పించాం అనే దానిపై ఫలితం ఆధారపడి వుంటుంది. పూజా మందిరంలో ఎప్పుడూ బూజు పట్టకుండా చూసుకోవాలి. క్రితం రోజున సమర్పించిన పువ్వులను ఉదయాన్నే తీసివేయాలి. క్రితం రోజున ఉపయోగించిన దీపారాధన కుందుల జతను పక్కకు పెట్టి మరోజత కుందులను ఏర్పాటు చేసుకోవాలి.

భగవంతుడి సన్నిధిలో వెండిపాత్రలో గానీ ... రాగిపాత్రలో గాని మంచినీళ్లను ఉంచుతూ, ఏరోజుకారోజు వాటిని మారుస్తూ వుండాలి. ఇలా పూజామందిరంలో అన్నీ ఒక పద్దతిగా ... పవిత్రంగా ఏర్పాటు చేసుకుని, రుచికరమైన పదార్థాలను ... తాజా ఫలాలను నైవేద్యంగా సమర్పించాలి. ఏ రోజున దైవానికి ఏ పదార్థాలను ... ఏయే ఫలాలను నైవేద్యంగా పెట్టాలనేది ముందుగానే అనుకుని ఆ ప్రకారం అవి సిద్ధం చేసుకోవాలి.

ఈ విధమైన ప్రణాళిక భగవంతుడి పట్ల గల ప్రేమానురాగాలను ప్రతిబింబిస్తూ వుంటుంది ... సంతోషంతో కూడిన సంతృప్తిని కలిగిస్తూ వుంటుంది. అనుకోని కారణాల వలన దైవానికి పండ్లను సమర్పించలేక పోయినప్పుడు బెల్లం ... పటిక బెల్లం ... ఖర్జూర పండ్లు నైవేద్యంగా పెట్టవచ్చు. ఏదో శాస్త్రానికే నైవేద్యం పెట్టడం అనుకోకుండా, భగవంతుడి ఆకలి తీర్చాలనే ఆరాటం ఉండటం మంచిదని భావించాలి. భగవంతుడు పలు రుచులను కోరడు ... ఆయనని అనేక రకాల ఆభరణాలతో అలంకరించి మురిసిపోయినట్టుగానే, వివిధ రకాల నైవేద్యాలను సమర్పిస్తూ సంతృప్తిని చెందాలి.

పూజా మందిరంలో వున్నది కేవలం చిత్రపటాలు ... చిన్న విగ్రహాలు మాత్రమే అయితే నైవేద్యంగా ఫలాలు సరిపోతాయి. ఓ మాదిరి విగ్రహాలు ఉన్నట్టయితే, మహా నైవేద్యంగా అన్నప్రసాదాన్ని సమర్పించవలసి వుంటుంది. భగవంతుడికి వివిధ రకాలైన నైవేద్యాలను సమర్పించడం అనేది ఆయనపట్ల గల అనురాగాన్ని ఆవిష్కరిస్తూ వుంటుంది. ఆయన మనసు గెలుచుకోవడంలో కీలకమైన పాత్రను పోషిస్తూ వుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

More Bhakti Articles