అష్టలక్ష్మీ దర్శనం

అష్టలక్ష్మీ దర్శనం
లక్ష్మీదేవి అమ్మవారు తన భక్తులకు తన అనుగ్రహం సులభంగా లభించాలనే ఉద్దేశంతో ఎనిమిది రూపాల్లో అవతరించింది. ఆదిలక్ష్మీ .. ధనలక్ష్మీ .. ధాన్యలక్ష్మీ .. సంతాన లక్ష్మీ .. విద్యా లక్ష్మీ .. ధైర్యలక్ష్మీ .. విజయ లక్ష్మీ .. గజలక్ష్మీ అనే రూపాలతో 'అష్టలక్ష్మి' గా పిలవబడుతోంది. ఈ ఎనిమిది మంది అమ్మవార్లలో ఒక్కొక్కరిని ఆరాధించడం వలన ఒక్కో ఫలితం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి.

ఇక ఈ ఎనిమిది మంది అమ్మవార్లలో ఏ ఒక్కరినీ పూజించినా అందరినీ ఆరాధించిన ఫలితం దక్కుతుంది. ధన ధాన్యాలు ... కీర్తి ప్రతిష్టలు ... భోగభాగ్యాలు ప్రసాదించే ఈ అమ్మవార్లను ప్రతి ఒక్కరూ అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తూ వుంటారు. అలా భక్తజన కోటిచే నిత్యనీరాజనాలు అందుకుంటోన్న అష్టలక్ష్మీ ఆలయం కృష్ణా జిల్లా 'చిన ఎరుకపాడు'లో దర్శనమిస్తుంది.

సువిశాలమైన ప్రదేశంలో ఓ వైపున గణపతి మందిరం ... మరోవైపున సుబ్రహ్మణ్య స్వామి మందిరం కొలువై వుండగా, మధ్యలో అష్టలక్ష్మీ ఆలయం దర్శనమిస్తుంది. పద్మాలను పోలిన చక్కని నగిషీలతో నిర్మించబడిన ఈ ఆలయంలో ప్రధానదైవంగా 'శ్రీ మహాలక్ష్మీదేవి' దర్శనమిస్తుంది. విశేషమైన అలంకారాలతో .. దివ్యమైన తేజస్సుతో అమ్మవారి మూలమూర్తి వెలుగొందుతూ వుంటుంది. అమ్మవారి సన్నిధిలో ప్రతి శుక్రవారం సామూహిక కుంకుమ పూజ జరుగుతుంటుంది.

ఇదే ప్రాంగణంలో దత్త పాదుకలతో పాటు అనఘాదేవి దర్శనమిస్తుంది. ఈ కారణంగా ఇక్కడ అనఘావ్రతం కూడా నిర్వహిస్తుంటారు. ప్రశాంతమైన వాతావరణంలో నిర్మించబడిన ఈ ఆలయాన్ని దర్శించడం వలన, అష్టలక్ష్ముల అనుగ్రహంతో పాటు అనఘాదేవి ఆశీస్సులు కూడా లభిస్తాయి. ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి.

More Bhakti Articles