చదువుపట్ల ఆసక్తి కలగాలంటే ఏం చేయాలి?

చదువుపట్ల ఆసక్తి కలగాలంటే ఏం చేయాలి?
విద్య అనేది వివేకంతో కూడిన జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ప్రపంచాన్ని అర్థం చేసుకుని ముందుకు నడవడానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. విద్య కేవలం ఉపాధినే కాదు ... నలుగురిలో గుర్తింపును ... గౌరవాన్ని తెస్తుంది. అలా తమ పిల్లలు నలుగురిలో దీపమై వెలగాలనే తల్లిదండ్రులు కలలు కంటుంటారు. ఆ కలలు నిజమయ్యే క్షణం కోసం వాళ్లు ఆత్రంగా ... ఆరాటంతో ఎదురుచూస్తూ వుంటారు.

తమ పిల్లలకి మంచి చదువు చెప్పించడం మినహా తమ ముందు మరే లక్ష్యం లేదన్నట్టుగా తల్లిదండ్రులు ఈ విషయంపై దృష్టి పెడతారు. ఈ నేపథ్యంలో తమ పిల్లల మార్కుల శాతం కాస్త తగ్గిందంటే వాళ్లు కంగారుపడిపోతారు. జ్ఞాపకశక్తి తక్కువగా ఉండటమే అందుకు కారణమని తెలిస్తే తల్లడిల్లిపోతారు. పిల్లలు వెనకబడి పోకూడదనే ఉద్దేశంతో అందుకు కావలసిన జాగ్రత్తలన్నీ తీసుకుంటారు.

సాధారణంగా చాలామంది ఇంట్లో బీరువా ఏవైపున ఉండాలో ... మంచాలు ఏ దిక్కులో ఉండాలో తెలుసుకుని ఆ పద్ధతులను పాటిస్తూ వుంటారు. అలాగే పిల్లలు ఇంట్లో చదువుకోవడానికి తగిన వాతావరణం వుందో .. లేదోననే విషయాన్ని తల్లిదండ్రులు గమనించాలి. పిల్లల చదువుపై కూడా దిక్కుల ప్రభావం ఉంటుందనే విషయాన్ని గ్రహించాలి. అప్పుడే పిల్లలు ఏ దిశగా కూర్చుని చదవడం వలన ఎలాంటి ప్రయోజనాలు సాధిస్తూ ఉన్నారనేది తెలుస్తుంది.

ఉత్తర ముఖంగా కూర్చుని చదువుకోవడం మంచి ఫలితాలను ఇస్తుందని శాస్త్రం చెబుతోంది. ఉత్తరం ముఖంగా కూర్చోవడం వలన చదువుకు అవసరమైన అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. చదువు పట్ల ఆసక్తి పెరగడమే కాకుండా, చదివిన విషయాలు జ్ఞాపకం ఉండిపోతాయని అంటోంది. ఉత్తర ముఖంగా కూర్చుని చదువుకోవడం వలన చక్కని ప్రతిభా పాటవాలు సొంతమవుతాయని స్పష్టం చేస్తోంది.

చదువుకోవడానికి ముందుగా ప్రతి ఒక్కరూ గణపతిని గానీ ... సరస్వతీదేవిని గాని ... హయగ్రీవస్వామిని గాని మనసులో తలచుకుని చదవడం ప్రారంభించాలి. ఈ విధంగా చేయడం వలన ఆయా దైవాల అనుగ్రహం లభించడమే కాకుండా, చదువుకునేందుకు అవసరమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది.

More Bhakti Articles