నిస్వార్ధ సేవకి నిజమైన ఫలితం

నిస్వార్ధ సేవకి నిజమైన ఫలితం
ప్రతి వ్యక్తిలోనూ దైవాన్ని దర్శించమనీ ... కష్టాల్లో ఉన్నవారికి సహకరించమనీ ... ఆపదలో వున్న వారిని ఆదుకోమన్నదే అన్ని మతాల సారంగా కనిపిస్తూ వుంటుంది. మానవత్వం మానవుడి ప్రాథమిక హక్కు అని ఎంతోమంది గురువులు తమ భోదనల ద్వారా తెలియజేస్తూ వస్తున్నారు. నిస్వార్ధంతో చేసే ప్రతిసేవ వలన అనంతమైన పుణ్య ఫలాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

ఇతరులకి సాయం చేయడం వలన సమయం వృథా అవుతుందనీ ... సంపాదన ఖర్చు అవుతుందని ఆలోచించ కూడదు. మనకి భగవంతుడు సాయపడాలని అనుకున్న సమయంలో అప్పటి వరకూ మనం అనుసరించిన మార్గమే అందుకు అడ్డుపడుతూ వుంటుంది. అవసరాల్లో వున్న వారిని ఆదుకోవడం వల్లనే, భగవంతుడు మనకి మరింత సామర్థ్యాన్ని ఇస్తాడనే విషయాన్ని గ్రహించాలి.

ఈ నేపథ్యంలో నిస్సహాయ స్థితిలో వున్న వృద్ధులకు ... వికలాంగులకు ... అనాథలైన బాలబాలికలకు తోచిన సహాయాన్ని అందించాలి. అంతే కాకుండా పశువులను ... పక్షులను ప్రేమిస్తూ వాటి రక్షణ - పోషణ భారాన్ని వహిస్తూ వుండాలి. భోజనం వేళలో వచ్చిన వారిని అతిథులుగా భావించి వారిని ఆదరించి ఆకలి తీర్చాలి. చలికాలంలో దుప్పట్లు ... వేసవికాలంలో మంచినీరు ... వర్షాకాలంలో తుపానుల కారణంగా నిరాశ్రయులైన వారిలో శక్తి మేరకు కొందరికి వసతి కల్పించాలి.

ఈ విధంగా అందరికీ సేవలను అందించడం వలన భగవంతుడు సంతోషిస్తాడు. మన వలన పదిమందికి మంచి జరుగుతున్నప్పుడు మనకి హాని జరగకుండా ఆయన సదా కాపాడుతూ వుంటాడు. నిస్వార్థమైన సేవ చేయడం వలన సమస్త దోషాలు తొలగిపోతాయనీ, మరణం అనంతరం స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి. నిస్వార్ధంతో చేసే ప్రతి సేవకు భగవంతుడు నిజమైన ఫలితాన్ని ముట్టజెపుతాడనే విషయాన్ని మరిచిపోకూడదు.

More Bhakti Articles