షుగర్ వ్యాధి లివర్ ను కూడా వదలదా?

  • మధుమేహం కాలేయంతో పాటు ఇతర అవయవాలపైనా ప్రభావం 
  • నిరంతర అలసట కాలేయ సమస్యకు తొలి సంకేతం 
  • చర్మం, కళ్లు పసుపు రంగులోకి మారడం కాలేయ వైఫల్యానికి సూచన
  • పొత్తి కడుపులో నొప్పి, వాపు కాలేయ సమస్యకు సంకేతాలు
  • మూత్రం రంగు మారడం, మలంలో మార్పులు కూడా ముఖ్యమైన లక్షణాలే
  • ఆకలి తగ్గడం, కారణం లేకుండా బరువు తగ్గడం ప్రమాదకరమే!
మధుమేహం, నేటి ఆధునిక జీవనశైలిలో అనేకమందిని పట్టిపీడిస్తున్న దీర్ఘకాలిక వ్యాధి. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపు తప్పడం వల్ల తలెత్తే ఈ సమస్య, కేవలం చక్కెరకే పరిమితం కాకుండా శరీంలోని అనేక కీలక అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా, మన శరీరంలో జీవక్రియల కర్మాగారంగా పిలువబడే కాలేయంపై మధుమేహం ప్రభావం అత్యంత ప్రమాదకరమైనది. సకాలంలో గుర్తించి సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే, కాలేయ వైఫల్యానికి దారితీసే అవకాశం ఉంది. మధుమేహం ఉన్నవారు తమ కాలేయం ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోవడానికి కొన్ని ముఖ్యమైన లక్షణాలపై దృష్టి సారించాలి.

ప్రధాన లక్షణాలు

1.అంతుచిక్కని అలసట: సాధారణంగా పనిచేసిన తర్వాత అలసట రావడం సహజం. కానీ, ఎంత విశ్రాంతి తీసుకున్నా తగ్గని నిరంతరమైన అలసట మిమ్మల్ని పట్టిపీడిస్తుంటే, అది కాలేయ సమస్యకు తొలి హెచ్చరిక కావచ్చు. కాలేయం దెబ్బతిన్నప్పుడు శరీరంలోని విషపదార్థాలను సరిగా బయటకు పంపలేదు. ఇవి రక్తంలో చేరి తీవ్రమైన నీరసాన్ని కలిగిస్తాయి. మధుమేహగ్రస్తులలో ఈ లక్షణం మరింత స్పష్టంగా కనిపించవచ్చు.

2. చర్మం, కళ్లు పసుపు పచ్చగా మారడం (కామెర్లు): కాలేయ సమస్యలకు ఇది ఒక స్పష్టమైన సంకేతం. బిలిరుబిన్ అనే పసుపు రంగు పదార్థం రక్తంలో అధికంగా చేరినప్పుడు చర్మం, కంటిలోని తెల్లటి భాగం పసుపు రంగులోకి మారతాయి. దెబ్బతిన్న కాలేయం బిలిరుబిన్‌ను సరిగా విసర్జించలేకపోవడమే దీనికి కారణం. మధుమేహం ఉన్నవారిలో కామెర్లు కనిపిస్తే తక్షణ వైద్య సహాయం అవసరం.

3. పొత్తి కడుపులో నొప్పి, వాపు: కాలేయం కుడివైపు ఉదరభాగంలో ఉంటుంది. ఈ ప్రాంతంలో తరచుగా నొప్పిగా ఉండటం, లేదా పొత్తి కడుపు ఉబ్బినట్లు, నీరు చేరినట్లు అనిపించడం కూడా కాలేయ సమస్యను సూచిస్తుంది. ముఖ్యంగా కుడివైపు పైభాగంలో నొప్పి లేదా అసౌకర్యం ఉంటే అనుమానించాల్సిందే.

4. మూత్రం, మలం రంగులో మార్పులు: మూత్రం ముదురు పసుపు లేదా గోధుమ రంగులోకి మారడం, మలం తెల్లగా లేదా బంకమన్ను రంగులో రావడం వంటివి కాలేయ పనితీరు మందగించిందనడానికి సంకేతాలు. బిలిరుబిన్ స్థాయిలలో మార్పుల వల్లే ఈ లక్షణాలు కనిపిస్తాయి.

5. ఆకలి మందగించడం, బరువు తగ్గడం: కారణం లేకుండా ఆకలి తగ్గడం, ఆహారం రుచించకపోవడం, దీని ఫలితంగా అకారణంగా బరువు తగ్గిపోవడం కూడా కాలేయ సమస్యల వల్లే జరగవచ్చు. జీర్ణక్రియలో కాలేయం పాత్ర కీలకమైనది కాబట్టి, దాని పనితీరు దెబ్బతింటే ఈ మార్పులు సహజం.

మధుమేహం ఉన్నవారు పైన పేర్కొన్న లక్షణాలలో ఏవైనా గమనిస్తే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా కాలేయ సమస్యల ముప్పును తగ్గించుకోవచ్చు. 


More Telugu News