సంగారెడ్డి జిల్లాలో విషాదం.. విష‌మిచ్చిన త‌ల్లి.. ముగ్గురు పిల్ల‌ల మృతి

  • ముగ్గురు బిడ్డ‌ల‌కు నిన్న‌ రాత్రి పెరుగ‌న్నంలో విషం క‌లిపి తినిపించిన త‌ల్లి
  • అనంత‌రం తానూ అదే ఆహారం తీసుకున్న వైనం
  • పిల్ల‌లు మృతి.. త‌ల్లి ప‌రిస్థితి విష‌మం
తెలంగాణ‌లోని సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో విషాదం చోటుచేసుకుంది. స్థానిక రాఘ‌వేంద్ర న‌గ‌ర్ కాల‌నీలో నివాసం ఉంటున్న ఓ మ‌హిళ త‌న ముగ్గురు బిడ్డ‌ల‌కు గురువారం రాత్రి పెరుగ‌న్నంలో విషం క‌లిపి తినిపించి అనంత‌రం తానూ తీసుకుంది. దీంతో ముగ్గురు పిల్ల‌లు ప్రాణాలు కోల్పోయారు. త‌ల్లిని ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా ఆమె ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు స‌మాచారం.

నిన్న‌ రాత్రి ర‌జిత అనే మ‌హిళ‌ త‌న ముగ్గురు పిల్ల‌లు సాయికృష్ణ‌(12), మ‌ధుప్రియ‌(10), గౌత‌మ్‌(8)ల‌కు పెరుగ‌న్నంలో విషం క‌లిపి పెట్టింది. ఆమె కూడా అదే ఆహారాన్ని తీసుకుంది. భ‌ర్త చెన్న‌య్య‌కు మాత్రం ప‌ప్పు అన్నం పెట్టింది. పెరుగు అన్నం తిన్న ముగ్గురు పిల్ల‌లు ఇంట్లోనే ప్రాణాలు కోల్పోయారు. 

ముగ్గురు పిల్ల‌ల మృత‌దేహాల‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న ర‌జిత ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు స‌మాచారం. కాగా, కుటుంబ గొడ‌వ‌ల కార‌ణంగానే ర‌జిత ఈ అఘాయిత్యానికి ఒడిగ‌ట్టిన‌ట్లు తెలుస్తోంది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.




More Telugu News