ఐపీఎల్‌ డేటాతో వైభవ్‌ను టార్గెట్‌ చేసిన ఇంగ్లండ్‌!

  • వైభవ్‌ ఎక్కడ ఇబ్బంది పడతాడో తెలుసన్న రషీద్‌
  • అదే ప్రణాళికను అమలు చేస్తున్నామని వెల్లడి
  • ఇంగ్లండ్‌తో ఆడిన రెండు మ్యాచుల్లో వైభవ్‌ విఫలం
  • షార్ట్‌ పిచ్‌ బంతులకు ఇబ్బందిపడుతున్న వైనం
  • వైభవ్‌కు మొయిన్‌ అలీ మద్దతు
  • అనుభవంతో ఆటను మార్చుకోవాలని సూచన
భారత యువ ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీపై ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ ఆదిల్‌ రషీద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌లో అతని ఆటను పూర్తిగా విశ్లేషించామని, ఏ బంతుల వద్ద ఇబ్బంది పడతాడో తమకు స్పష్టమైన సమాచారం ఉందని వెల్లడించాడు. అదే ప్రణాళికను టీ20 సిరీస్‌లో అమలు చేస్తున్నామని చెప్పాడు.

ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఇప్పటివరకు వైభవ్‌ రెండు మ్యాచ్‌లు ఆడాడు. 13, 14 పరుగులకే పరిమితమయ్యాడు. రెండో మ్యాచ్‌లో విల్‌ జాక్స్‌కు, మూడో మ్యాచ్‌లో జోఫ్రా ఆర్చర్‌కు వికెట్‌ ఇచ్చాడు. ముఖ్యంగా షార్ట్‌పిచ్‌ బంతులపై అతను ఇబ్బంది పడిన విషయం చర్చనీయాంశమైంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కాగా, తర్వాతి రెండు మ్యాచ్‌లు గెలిచిన ఇంగ్లండ్‌ 2-0తో సిరీస్‌ను ఇప్పటికే కైవసం చేసుకుంది.

అంతర్జాతీయ క్రికెట్‌లో వైభవ్‌ కొత్త ఆటగాడే అయినా, ఐపీఎల్‌ వల్ల అతనిపై అవసరమైన డేటా అందుబాటులోకి వచ్చిందని చెప్పాడు. అతను ఎక్కడ బలంగా ఉంటాడు, ఎక్కడ బలహీనంగా ఉంటాడో గుర్తించి బౌలింగ్‌ ప్రణాళిక రూపొందించామని వెల్లడించాడు.

మరోవైపు మాజీ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ మాత్రం వైభవ్‌కు అండగా నిలిచాడు. షార్ట్‌పిచ్‌ బంతులు అతని బలహీనత కాదని తెలిపాడు. అలాంటి బంతులను గతంలో ఎన్నోసార్లు సిక్సర్లుగా మలిచాడని గుర్తు చేశాడు. అయితే మరో రెండు, మూడు మ్యాచ్‌ల్లో కూడా పరుగులు చేయలేకపోతే ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డాడు.

వైభవ్‌ వయసు కేవలం 15 ఏళ్లేనని, అలాంటి ఆటగాడిపై సహజంగానే ఒత్తిడి ఉంటుందని రషీద్‌ పేర్కొన్నాడు. ప్రస్తుతం అతనికి సహజమైన ఆట ఆడే స్వేచ్ఛను భారత్‌ ఇచ్చిందని, భవిష్యత్తులో వివిధ పరిస్థితుల్లో ఆడుతూ ఇబ్బందులు ఎదురైనప్పుడు తన ఆటలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుందని సూచించాడు.

Vaibhav Sooryavanshi Adil Rashid
India vs England T20
IPL data analysis
Moeen Ali
Short pitch bowling

More Telugu News