బీహార్‌లో నకిలీ సర్టిఫికెట్లతో కొలువులు పొందిన 3,035 మంది ఉపాధ్యాయుల తొలగింపు!

  • నకిలీ సర్టిఫికెట్ల కుంభకోణం బట్టబయలు
  • ఇప్పటికే 1,830 ఎఫ్‌ఐఆర్‌ల నమోదు
  • జీతాలన్నీ వడ్డీతో సహా రికవరీ
  • ముందే రాజీనామా చేసినా వదిలేదేలేదని ప్రభుత్వం హెచ్చరిక
బీహార్ విద్యాశాఖ రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. నకిలీ పట్టాలు, ఫోర్జరీ చేసిన విద్యా ధ్రువీకరణ పత్రాలను సమర్పించి మోసపూరితంగా ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు సంపాదించిన 3,035 మంది టీచర్లను విధుల్లోంచి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. 2006 నుండి 2015 మధ్య కాలంలో జరిగిన ఉపాధ్యాయుల నియామకాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర విజిలెన్స్ బ్యూరో గత కొంతకాలంగా లోతైన దర్యాప్తు చేపట్టింది. ఈ సుదీర్ఘ విచారణ ముగిసిన తర్వాత విజిలెన్స్ బ్యూరో సమర్పించిన నివేదిక ఆధారంగా ఈ భారీ చర్యలకు విద్యాశాఖ పూనుకుంది.

ఈ విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చాలామంది అభ్యర్థులు ఉనికిలో లేని నకిలీ కాలేజీల సర్టిఫికెట్లను సృష్టించగా, మరికొందరు ఒరిజినల్ సర్టిఫికెట్లను ఫోర్జరీ చేసి ప్రభుత్వ కొలువులు దక్కించుకున్నారు. ఈ కుంభకోణంలో నిందితులుగా తేలిన 3,035 మంది ఉపాధ్యాయులపై ఇప్పటికే వివిధ పోలీస్ స్టేషన్లలో 1,830 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. కేవలం ఉద్యోగాల నుండి తొలగించడమే కాకుండా, వీరు సర్వీసులో ఉన్న కాలంలో ప్రభుత్వం నుండి పొందిన జీతభత్యాలు, గౌరవ వేతనాలను కూడా వడ్డీతో సహా తిరిగి వసూలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. అధికారికంగా వారిని విధుల్లోంచి తొలగించిన వెంటనే ఈ రికవరీ ప్రక్రియ ప్రారంభం కానుంది.

విజిలెన్స్ విచారణ తీవ్రరూపం దాల్చడంతో, కొందరు ఉపాధ్యాయులు శాఖాపరమైన చర్యల నుండి తప్పించుకోవడానికి ముందే తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేశారు. అయితే, రాజీనామా చేసినంత మాత్రాన వారు చట్టపరమైన విచారణ నుండి తప్పించుకోలేరని, మోసపూరిత మార్గాల్లో లబ్ధి పొందిన ప్రతి ఒక్కరిపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. విద్యా నియామకాల్లో పారదర్శకతను పెంచడానికి, ఏళ్ల తరబడి వ్యవస్థను పట్టిపీడిస్తున్న అక్రమాలను అంతమొందించి ప్రభుత్వ విద్యావ్యవస్థపై ప్రజల్లో మళ్లీ నమ్మకాన్ని పునరుద్ధరించడానికే ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

Bihar Education Department
Bihar Fake Teacher Scam
Dismissed Teachers Bihar
Teacher Recruitment Fraud
Bihar Vigilance Bureau
Fake Degree Certificate Case

More Telugu News