ఇంకా చీకట్లోనే 65 కోట్ల మంది.. ఐరాస నివేదికలో షాకింగ్ నిజాలు!
- గణనీయంగా మందగించిన విద్యుద్దీకరణ పనులు
- 200 కోట్ల మంది ఇంకా కాలుష్య కారక ఇంధనాలతోనే వంట
- విద్యుత్ కొరత ఎక్కువగా సబ్-సహారన్ ఆఫ్రికా దేశాల్లోనే
- ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంకు తాజా నివేదికలో వెల్లడి
జూన్ 24న విడుదలైన ఈ నివేదిక ప్రకారం.. గత పదేళ్లతో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చే ప్రక్రియ వేగం భారీగా మందగించింది. 2023, 2024 మధ్య కాలంలో కేవలం 1.15 కోట్ల మందికి మాత్రమే కొత్తగా విద్యుత్ సౌకర్యం లభించింది. ఈ వేగం అంతకుముందు దశాబ్దపు సగటు వేగంతో పోలిస్తే సగం మాత్రమే కావడం ఆందోళన కలిగిస్తోంది.
ఆఫ్రికాలోనే అత్యధికం
ఈ విద్యుత్ కొరత ప్రభావం అత్యధికంగా సబ్-సహారన్ ఆఫ్రికాలోని గ్రామీణ, తక్కువ ఆదాయం ఉన్న, అంతర్గత ఘర్షణలు ఎదుర్కొంటున్న ప్రాంతాలపై పడింది. ప్రపంచవ్యాప్తంగా కరెంట్ లేని వారిలో అత్యధికులు ఈ ప్రాంతానికి చెందినవారే.
మరోవైపు, విద్యుత్ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 కోట్ల మంది ప్రజలు ఇప్పటికీ వంట కోసం కాలుష్యాన్ని వెదజల్లే సంప్రదాయ ఇంధనాలపై (కట్టెలు, బొగ్గు వంటివి) ఆధారపడుతున్నారని నివేదిక స్పష్టం చేసింది. "65.5 కోట్ల మందికి కరెంట్ లేదు, మరో 200 కోట్ల మంది కాలుష్య కారక ఇంధనాలతో వంట చేస్తూ తమ ఆరోగ్యాన్ని, ప్రాణాలను పణంగా పెడుతున్నారు" అని ప్రపంచ బ్యాంక్ , ఐరాస సంయుక్త ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశాయి.
సవాళ్లు.. పరిష్కారాలు
అంతర్జాతీయంగా పేద దేశాలకు అందుతున్న ఆర్థిక సాయం తగ్గడం, మారుమూల ప్రాంతాలకు విద్యుత్ లైన్లు వేయడానికి అయ్యే భారీ ఖర్చులు ఈ మందగమనానికి ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. క్లీన్ కుకింగ్ (పరిశుభ్రమైన వంట ఇంధనం) వాడకం ప్రపంచవ్యాప్తంగా 75 శాతానికి చేరినప్పటికీ, ఇదే వేగం కొనసాగితే 2030 నాటికి కూడా 180 కోట్ల మందికి ఈ సౌకర్యం అందే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు.
విద్యుత్, గ్యాస్ లేకపోవడం వల్ల కేవలం వెలుతురు మాత్రమే కాదు.. పేద దేశాల్లో విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కూడా దెబ్బతింటున్నాయని ఐరాస పేర్కొంది. ఈ అంతరాన్ని పూడ్చడానికి అంతర్జాతీయ సమాజం తక్షణమే పెట్టుబడులను పెంచాలని, వినూత్న పరిష్కారాలతో ముందుకు రావాలని నివేదిక పిలుపునిచ్చింది.