సీఎం చంద్రబాబుకు ఉద్యోగ సంఘాల కృతజ్ఞతలు.. కేబినెట్ నిర్ణయాలపై హర్షం

  • ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై కేబినెట్ సానుకూల నిర్ణయాలు
  • పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచడంపై నేతల హర్షం
  • కొందరు ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలుకు మార్గం సుగమం
  • రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని ఉద్యోగులకు సీఎం పిలుపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరిస్తూ రాష్ట్ర మంత్రిమండలి తీసుకున్న కీలక నిర్ణయాల పట్ల ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును సచివాలయంలో కలిసి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపినందుకు ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు.

పలు విభాగాల్లో ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచడం, పాత పెన్షన్ విధానం (OPS) వర్తింపజేయడం వంటి నిర్ణయాలు వేలాది మంది ఉద్యోగులకు, వారి కుటుంబాలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయని నేతలు పేర్కొన్నారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలకు పరిష్కారం లభించడం పట్ల వారు సంతోషాన్ని వెలిబుచ్చారు.

కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS) నోటిఫికేషన్‌కు ముందే నియామక ప్రక్రియ పూర్తయి, ఆ తర్వాత విధుల్లో చేరిన వారికి పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేస్తూ ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. ప్రభుత్వ నిర్ణయాలు ఉద్యోగ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయని నేతలు అభిప్రాయపడ్డారు.

ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఏపీ జేఏసీ చైర్మన్ విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి ప్రసాద్, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి నాపా ప్రసాద్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి కోసం ఉద్యోగులందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారికి సూచించారు.                                

Chandrababu Naidu
AP Cabinet Decisions
AP Government Employees
Old Pension Scheme AP
AP JAC
Retirement Age Increase AP

More Telugu News