పవన్ కు మద్దతుగా క్యాబినెట్ సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- పవన్ కల్యాణ్ను లక్ష్యంగా చేసుకుంటే గట్టిగా బదులివ్వాలని మంత్రులకు సీఎం ఆదేశం
- నేరస్థులతో వైసీపీ రాజకీయాలు చేస్తోందని చంద్రబాబు విమర్శ
- జూలై 3న కడప స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేయనున్నట్టు వెల్లడి
- శాఖలకే పరిమితం కావొద్దు, అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవాలని సూచన
- 80కి పైగా అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం
వైసీపీ నేరస్థులతో కలిసి రాజకీయాలు చేస్తోందని, కర్నూలు ఘటనను ఉదాహరణగా చూపుతూ కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోందని చంద్రబాబు ఆరోపించారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ను వివాదాల్లోకి లాగేందుకు ప్రయత్నిస్తే మంత్రులంతా ఐక్యంగా, గట్టిగా బదులివ్వాలని సూచించారు. ప్రభుత్వంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని స్పష్టం చేశారు.
మంత్రులు కేవలం తమ శాఖలకే పరిమితం కాకుండా, డీఎస్సీ వంటి ఇతర కీలక అంశాలపై కూడా పూర్తి అవగాహన పెంచుకోవాలని చంద్రబాబు సూచించారు. ఇదే సమయంలో, కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గ్రామంలో స్వర్ణ ప్రాజెక్టులు ఉన్నందున ఆ గ్రామాన్ని 'స్వర్ణ గ్రామం'గా ప్రకటించాలని ప్రతిపాదించారు. జూలై 3న కడప స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేయనున్నట్లు కూడా ఆయన వెల్లడించారు.
అంతకుముందు జరిగిన కేబినెట్ సమావేశంలో పరిశ్రమలు, ఐటీ, పర్యాటకం, డేటా సెంటర్లు, పునరుత్పాదక ఇంధన రంగాలకు సంబంధించి 80కి పైగా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ మృతి కేసులో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందని, దీనిని వైసీపీ రాజకీయం చేస్తోందని మంత్రులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ విచారణపై మృతుడి కుటుంబ సభ్యులు విశ్వాసం వ్యక్తం చేశారని కూడా సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది.