యూరియా యాప్ పై నిరసన.. వేముల ప్రశాంత్ రెడ్డి గృహ నిర్బంధం
- యూరియా యాప్ రద్దు చేయాలంటూ వేముల డిమాండ్
- తాడ్వాయి మండలంలో రైతు ధర్నాకు బీఆర్ఎస్ నిర్ణయం
- ఇంటి నుంచి వెళుతుండగా అడ్డుకున్న పోలీసులు
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఆయన నివాసానికి చేరుకున్న పోలీసులు.. ఆయనను ఇంటి నుంచి బయటకు రాకుండా గృహ నిర్బంధంలో ఉంచారు.
వివరాల్లోకి వెళితే... 'యూరియా యాప్' వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ యాప్ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా తాడ్వాయి మండలంలో ఒక భారీ రైతు ధర్నా చేపట్టాలని నిర్ణయించారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంచార్జి సురేందర్ ఆధ్వర్యంలో వేలాది మంది రైతులు ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. ఈ ధర్నాలో పాల్గొనేందుకు తన నివాసం నుంచి బయల్దేరేందుకు వేముల సిద్ధమవగా... పోలీసులు ఆయనను నిలువరించారు. ఆయనను గృహ నిర్బంధం చేశారు.